శబరిమల సన్నిధిలో ఇద్దరు "మహిళా భక్తులు".. తెల్లవారుజామున "దర్శనం"
Recommended Video
కేరళ : 50 ఏళ్ల లోపు మహిళా భక్తులను అయ్యప్ప ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో శబరిమలలో రణ నినాదాలు మార్మోగుతూనే ఉన్నాయి. అయ్యప్ప దర్శనానికి వచ్చే మహిళలను భక్తులు అడ్డుకుంటూనే ఉన్నారు. ఈనేపథ్యంలో ఇద్దరు మహిళా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారనే వీడియో వైరల్ గా మారింది. పోలీస్ ఎస్కార్ట్ తో 40 ఏళ్ల లోపు వయసున్న కనకదుర్గ, బిందు అనే మహిళా భక్తులు తెల్లవారుజామున ఆలయంలోనికి ప్రవేశించినట్లు సమాచారం.
నల్లటి దుస్తులు ధరించిన ఈ ఇద్దరు భక్తులు అర్ధరాత్రి పంబ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరి స్వామి సన్నిధికి చేరుకున్నారట. తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు స్వామివారిని దర్శించుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో పెద్దగా భక్తజన సందోహం లేకపోవడంతో వీరికి తొందరగానే దర్శనమైనట్లు తెలుస్తోంది.
అదలావుంటే, అది నిజం కాకపోవచ్చంటున్నారు కొందరు అయ్యప్ప భక్తులు. అయ్యప్ప ధర్మ సేన సమితికి చెందిన రాహుల్ ఈశ్వర్ ఆ వీడియోలో నిజం లేకపోవచ్చంటున్నారు. అన్నీ విషయాలు పూర్తిగా తెలుసుకుంటామని.. ఒకవేళ అది నిజమని తేలితే అప్పుడు ఏంచేయాలో ఆలోచిస్తామని చెబుతున్నారు.
#WATCH Two women devotees Bindu and Kanakdurga entered & offered prayers at Kerala's #SabarimalaTemple at 3.45am today pic.twitter.com/hXDWcUTVXA
— ANI (@ANI) January 2, 2019
ఈ ఇద్దరు మహిళలు డిసెంబర్ 24వ తేదీన స్వామివారి దర్శనానికి ప్రయత్నించారు. అయితే అయ్యప్ప భక్తులు అడ్డుకోవడంతో పంబ నుంచి వెనుదిరిగినట్లు సమాచారం.