విజయ్ మాల్యాను అప్పటివరకూ అప్పగించం- భారత్కు తేల్చిచెప్పిన బ్రిటన్
బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్మాల్యాను త్వరలో భారత్కు తిరిగి తీసుకొస్తామంటూ నిన్న మొన్నటి వరకూ లీకులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం చివరికి చేతులెత్తేసింది. విజయ్ మాల్యాను అప్పగించడం కుదరదని బ్రిటన్ తమకు చెప్పినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం ఇవాళ చావు కబురు చల్లగా చెప్పింది.
రహస్యమైన న్యాయపరమైన చిక్కులు తొలగిపోయే వరకూ భారత్కు మాల్యాను అప్పగించలేమంటూ బ్రిటన్ భారత్కు తేల్చిచెప్పింది. జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు బ్రిటన్ తమకు పంపిన లేఖను కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది చదివి వినిపించారు. ఇందులో తదుపరి న్యాయపరమైన అంశాలు పరిష్కారం అయ్యేవరకూ మాల్యాను అప్పగించడం కుదరదని బ్రిటన్ వెల్లడించింది.
ఈ రహస్య న్యాయపరమైన అంశం ఏమిటో, అది ఎప్పటిలోగా పరిష్కారం అవుతుందో కూడా బ్రిటన్ అందులో వెల్లడించలేదు. కానీ మాల్యా వ్యవహారం భారత్కు ఎంత ముఖ్యమైనదో తమకు తెలుసంటూ సన్నాయి నొక్కులు మాత్రం నొక్కింది. సాధ్యమైనంత త్వరగా ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు ప్రయత్నిస్తామని బ్రిటన్ చెప్పినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అనంతరం మాల్యాను భారత్ రప్పించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అటార్నీ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను మార్చి 15కు వాయిదా వేసింది.