అంతరిక్షం నుంచి అమెరికా ఎన్నికలకు ఓటు వేశారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్న హిల్లరీ, ట్రంప్ సమరం మొదలయ్యింది. తమ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఉన్నా సరే మాకు కచ్చితంగా ఓటు వేస్తారని వీరిద్దరూ భావిస్తున్నారు.
దాదాపు 4.15 కోట్ల మంది ఇప్పటికే ముందస్తు ఓటింగ్ వేశారు. మిగిలిన ఓటర్లు నేడు (మంగళవారం) జరిగే పోలింగ్ లో పాల్గొంటున్నారు. అయితే భూమికి 17వేల మైళ్ల దూరంలో ఉన్న ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు అంతరిక్షం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ దేశ భక్తిని చాటుకున్నారు.
షేన్ కిమ్ బ్రో అనే వ్యోమగామి అధికారికంగా తన ఓటు హక్కును ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి వినియోగించుకున్నట్టు నాసా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. మరో వ్యోమగామి కేట్ రాబిన్స్ సైతం తను భూమిపైకి వచ్చే వారం ముందు అంతరిక్షం నుంచి ఓటు వేసినట్టు నాసా స్పష్టం చేసింది.
1997లో టెక్సాస్ చట్టసభలు అధికారికంగా పాస్ చేసిన బిల్లు వలనే ఇది సాధ్యమైయ్యిందని, ఆస్ట్రోనాట్స్ కోసం ఈ టెక్నికల్ ఓటింగ్ ప్రక్రియను తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది.
అంతరిక్షం నుంచి ఓటు వేసిన ఈ ఇద్దరు వ్యోమగాములు జాన్స్ సన్ స్పేస్ సెంటర్ సమీపంలోని హోస్టన్ ప్రాంతానికి చెందిన వార కావడం గమనార్హం. దీంతో వారు అంతరిక్షం నుంచే ఓటు వెయ్యడానికి అవకాశం ఉందని నాసా పేర్కొంది.
1997లో మొదటిసారి ఉపయోగించిన ఈ స్పేస్ ఓటింగ్ ను, నాసా వ్యోమగామి డేవిడ్ వోల్ఫ్ మొదటి సారి అంతరిక్షం నుంచి ఓటు వేశారు. దీంతో అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న మొదటి అమెరికన్ వ్యోమగామిగా ఆయన రికార్డు సృష్టించారు.