అమెరికాలో 270 మందికి పైగా భారతీయులపై ట్రంప్ వేటు
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారనే కారణంపై 270 మందికిపైగా భారతీయులపై దేశ బహిష్కరణ వేటు వేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది.
న్యూఢిల్లీ: అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం భారతీయులను టార్గెట్ చేసింది. అక్రమంగా నివసిస్తున్న భారతీయులపై దేశ బహిష్కరణ వేటు వేసేందుకు సిద్ధమైంది. 270 మందికిపైగా భారతీయులపై దేశ బహిష్కరణ వేటు వేయనున్నామని ట్రంప్ కార్యాలయం చెప్పినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అమెరికా బహిష్కరించడానికి ముందే ఆ 271 మంది జాబితాను తమకు అందజేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని భారత్ కోరినట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో పార్లమెంట్ కు తెలిపారు.
ఈ వ్యక్తులకు సంబంధించిన జాతీయతను తాము పరిశీలించడం కంటే ముందే, వారందరూ అక్రమంగా అమెరికాలో ఉన్నట్లు తాము ఎలా విశ్వసిస్తామని ట్రంప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు సుష్మా పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించాలని కూడా అమెరికాను అడిగినట్లు తెలిపారు.
అమెరికాలో భారతీయులపై జరుగుతున్న విద్వేషపూరిత దాడుల గురించి కూడా భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే దేశ బహిష్కరణకు సంబంధించి భారతీయుల జాబితాను తమకు అందించాలన్న భారత్ అభ్యర్థనపై ట్రంప్ కార్యాలయం ఇప్పటి వరకు స్పందించలేదు.
భారత్ నుంచి, ఆసియా ఖండంలోని ఇతర దేశాల నుంచి వచ్చిన చాలామంది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే వీసాల జారీలో కఠిన నిబంధనలు తీసుకొస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై కూడా ఉక్కుపాద మోపేందుకు కఠిన చర్యలు ప్రారంభించడం గమనార్హం.