లేడీ ఎగ్జిక్యూటివ్పై రేప్: ఉబేర్ క్యాబ్ డ్రైవర్ దోషి
న్యూఢిల్లీ: మహిళా ఎగ్జిక్యూటివ్ పై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉబేర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్ దోషిగా తేలాడు. అతను నేరం చేసినట్లు రుజువు అయ్యిందని ఢిల్లీ సెషన్స్ న్యాయస్థానం న్యాయమూర్తి కావేరి బవేజా తెలిపారు. ఢిల్లీలో జరిగిన అత్యాచారం కేసులో శివకుమార్ యాదవ్ దోషిగా తేలాడని మంగళవారం న్యాయమూర్తి ప్రకటించారు.
శివకుమార్ మీద మోపిన అభియోగాలు కోర్టులో నిరూపితం అయ్యాయని అతని తరపు న్యాయవాది ధర్మేంద్ర కుమార్ మిశ్రా చెప్పారు. ఈనెల 23వ తేదిన శివకుమార్ కు శిక్ష ఖరారు చేస్తామని న్యాయస్థానం చెప్పిందని ధర్మేంద్ర కుమార్ మిశ్రా అన్నారు.
2014 డిసెంబర్ 5వ తేదీ రాత్రి మహిళా ఎగ్జిక్యూటివ్ (25) గుర్గావ్ లో పని ముగించుకుని శివకుమార్ క్యాబ్ లో ఇంటికి బయలుదేరారు. ఆ సందర్బంలో శివకుమార్ కామంతో కళ్లు మూసుకుపోయి కారులోనే ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు.
తరువాత ఆమెను ఢిల్లీలో ఇంటి సమీపంలో వదిలి పరారైనాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శివకుమార్ కోసం గాలించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా గాలించి డిసెంబర్ 7వ తేదిన మధురలో నిందితుడు శివకుమార్ ను అరెస్టు చేశారు.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేశారు. మొత్తం 44 మంది సాక్షులను విచారణ చేశారు. 100 పేజీల చార్జ్ షీటు తయారు చేసి కోర్టులో సమర్పించారు. శివకుమార్ మీద మోపిన అన్ని అభియోగాలు నిరూపితం కావడంతో అతను దోషిగా తేలాడు.