ఉడాన్ : బాలికల ఉన్నత చదువుకు బాటలు వేస్తున్న పథకం
ఢిల్లీ: భారత్లో స్కూళ్లలో కాలేజీలలో చదువుకునే అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా ఇది గ్రామీణ భారతంలో మరికొంత ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ బాలికలు పాఠశాలకు వెళ్లినా ప్రాథమిక లేద మాధ్యమిక పాఠశాల తర్వాత చదువును మధ్యలోనే మానేస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ నేతృత్వంలో ఉడాన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
బాలిక సాధికారితకు వేదికగా ఉడాన్ నిలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో పై చదువులు చదవలేక చదువును మధ్యలోనే మానేస్తున్న వారికి ఉడాన్ పథకం ద్వారా ఆర్థికంగా అండగా నిలుస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇంజనీరింగ్ లాంటి ఉన్నత చదువులు చదివించి బాలికలను భారత అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తోంది ఉడాన్ పథకం.
ఉడాన్ పథకం ద్వారా వారాంతంలో బాలికలకు ఉచితంగా ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ తరగతులను నిర్వహించి శిక్షణ ఇస్తోంది. అంతేకాదు స్టడీ మెటీరియల్ కూడా టాబ్లెట్లో పొందుపరిచి వారికి అందిస్తోంది. ఇది ఇంజనీరింగ్లో ప్రవేశం పొందాలనుకునే 11వ తరగతి 12వ తరగతి బాలికలకు ఉడాన్ పథకం కింద ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. తద్వారా పరీక్షలో విజయం సాధిస్తే మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థినులు అడ్మిషన్ పొందేందుకు బాటలు వేస్తోంది.
ఉడాన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం బాలికలకు సైన్స్ , మ్యాథ్స్ సబ్జెక్టుల్లో శిక్షణ ఇచ్చి వారికి భవిష్యత్తును ఇవ్వడంతో పాటు వారు కూడా తాము చదువుకున్న చదువును ఇతరులకు చెప్పాలన్న ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.