14-14-14.... మహా సీఎం ఉద్దవ్ థాకరే..? క్యాబినెట్ బెర్తులు సమానం, కీలకశాఖలపై పట్టు
మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి మరికొద్ది గంటల్లో తెరపడే అవకాశం ఉంది. శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రి పదవీ చేపట్టబోతున్నారు. ఈ మేరకు ఓ వార్త సంస్థ కథనం ప్రచురించింది. ప్రభుత్వంలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సమానంగా మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి.
చర్చోపచర్చలు
ఢిల్లీలోని శరద్పవార్ నివాసంలో గురువారం కూడా కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. శివసేన కూటమితో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. మహారాష్ట్రలో 14-14-14తో మూడు పార్టీలు మంత్రి పదవులు పంచుకోవాలని అభిప్రాయానికి వచ్చాయి. సీఎం పదవీ రొటేషన్ గురించి ఎన్సీపీ మాత్రం ఎలాంటి డిమాండ్ చేయలేదని తెలుస్తోంది. ఉద్దవ్ సీఎం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్-ఎన్సీపీ సుముఖంగానే ఉన్నాయి.
ఇవీ పోర్టుఫోలియోలు
శివసేన పట్టణాభివృద్ధి, రక్షిత మంచినీటి పథకం, విద్య శాఖలు దక్కనున్నాయి. ఎన్సీపీకీ స్పీకర్ పదవీ కోరుతున్నట్టు తెలిసింది. దీంతోపాటు హోంశాఖ, ఆర్థిక, పీడబ్ల్యూడీ, నీటి వనరులు, గ్రామీణాభివృద్ధి కోరుతున్నాయి. ఇక కాంగ్రెస్ స్పీకర్తోపాటు ఆర్థిక, గ్రామీణాభివృద్ది, రెవెన్యూ శాఖలను కోరుతుంది.
మద్దతుపై క్లారిటీ
శివసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని పృథ్వీరాజ్ చౌహన్ తెలిపారు. రాష్ట్రంలోని సమస్యలపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అన్ని అంశాలపై పార్టీల మధ్య చర్చ జరిగిందని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి శుక్రవారం అధికారిక ప్రకటన ఉంటుందని ఆయన చెప్పారు.
పదవీ ప్రమాణం
శుక్రవారం మహారాష్ట్ర సీఎం పదవీ ప్రమాణం ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాకరే ప్రమాణం చేయనున్నారు. ఆయన అభ్యర్థిత్వానికే కాంగ్రెస్-ఎన్సీపీ ఆమోదం తెలిపాయి. ఆదిత్య పేరు తెరపైకి వచ్చినా.. ఆ రెండు పార్టీలు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ప్రత్యామ్నాయం ఉద్దవే కనపించారు. మంత్రి పదవులు మాత్రం సమానంగా పంచుకోనున్నారు.