ఉద్ధవ్ థాక్రే తొలి కేబినెట్ సమావేశం: ఆ రాజు రాజధాని అభివృద్ధికి రూ.20 కోట్లు విడుదల
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఉద్దవ్ థాక్రే కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పరిపాలన సమయంలో రాజధానిగా విరాజిల్లిన రాయగడ్ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించారు.ఇందులో భాగంగానే రాయగడ్కు వరాలు కురిపించారు. థాక్రే ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకున్న తొలినిర్ణయం ఇదే కావడం చాలా సంతోషాన్నిచ్చిందని సీఎం ఉద్ధవ్ థాక్రే అన్నారు.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తొలి కేబినెట్ సమావేశం
గురువారం సాయంత్రం శివాజీపార్క్ వేదికగా థాక్రే ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. థాక్రేతో పాటు మరో ఆరుగురు మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం జరిగిన తొలికేబినెట్ సమావేశంలో రాయగఢ్ అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించాలని డిసైడ్ అయ్యారు. ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు థాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రిగా చేసిన తొలి వ్యక్తి కూడా ఉద్ధవ్ థాక్రే కావడం విశేషం.
రైతు సమస్యలను పరిష్కరిస్తాం
మహారాష్ట్రలోని సామాన్య ప్రజల కోసం మహావికాస్ అగాడీ ప్రభుత్వం పనిచేస్తుందని థాక్రే చెప్పారు. భయాందోళనలు లేని వాతావరణం కల్పిస్తామని థాక్రే హామీ ఇచ్చారు. ఇక రైతులను అన్ని విధాలా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి క్లారిటీ వస్తే తాము ఏమి చేయగలమో అనేది సులభతరం అవుతుందని చెప్పిన సీఎం థాక్రే... ఇప్పటి వరకు రైతులకు హామీలే తప్ప ఏమీ జరగలేదన్నారు. తమ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. రైతు సమస్యలపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించామని చెప్పిన సీఎం థాక్రే... వివరాలన్నీ అందాక ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఫడ్నవీస్ మరోసారి కామన్ మినిమం ప్రోగ్రాంను చదవాలి
కాంగ్రెస్తో చేతులు కలిపిన తర్వాత శివసేన సెక్యులర్గా మారుతుందా అని విలేఖరులు అడిగి ప్రశ్నకు స్పందిచారు సీఎం ఉద్ధవ్ థాక్రే. రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదానికి ఎలాంటి నిర్వచనం ఉందో అదే ఉంటుందని చెప్పారు. ఇక కామన్ మినిమమ్ ప్రోగ్రాంపై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శిస్తూ చేసిన ట్వీట్ పై సీఎం ఉద్ధవ్ థాక్రే స్పందించారు. కేబినెట్ అంటే మొత్తం మహారాష్ట్రకు ఉంటుందని చెప్పిన థాక్రే... ఫడ్నవీస్కు అర్థంకాకపోతే మళ్లీ దాన్ని ఒకసారి చదవాలని సెటైర్ వేశారు. కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో మరఠ్వాడా, విదర్భ, ఉత్తర మహారాష్ట్రల గురించి ప్రస్తావన లేకపోవడాన్ని ఫడ్నవీస్ ట్విటర్ ద్వారా ప్రశ్నించారు.