5న అయోధ్య భూమి పూజకు ఉద్ధవ్ ఠాక్రే - మహా సర్కారును కూల్చాలంటూ బీజేపీకి సవాల్.. ఎన్సీపీ విభేదం..
అయోధ్య రామమందిరం వ్యవహారంపై మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ ఆగాధి(ఎంవీఏ) కూటమిలో చీలికలు ఏర్పడ్డాయి. ఆగస్టు 5న రామజన్మభూమిలో మందిర నిర్మాణానాకి భూమి పూజ జరుగనుండగా, ఆ కార్యక్రమానికి తాను హాజరవుతానంటూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం స్పష్టం చేశారు. కరోనా విజృంభిస్తున్నవేళ మందిర నిర్మాణం అవసరమా? అని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమిలోని రెండు పార్టీలూ పరస్పరం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో మరోసారి చీలకలు బయటపడినట్లయింది.
Recommended Video
కిమ్ జాంగ్ కు మోదీ సర్కార్ భారీ సాయం - కష్టకాలంలో ఉత్తరకొరియాకు ఆపన్నహస్తం - చైనా చైన్ తెగడంతో..
శివసేన పార్టీ ఆధ్వర్యంలోని సామ్నా పత్రికకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను 5న అయోధ్యకు వెళుతున్న విషయాన్ని సీఎం ఉద్ధవ్ కుండబద్దలు కొట్టారు. గతంలోనూ చాలా సందర్భాల్లో అయోధ్య వెళ్లి పూజలు చేశానని, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన రామజన్మభూమికి వెళ్లకుండా ఉండలేనని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో తమ ఎంవీఏ కూటమిలో విభేదాలు లేవనీ ఆయన చెప్పుకొచ్చారు.
మహారాష్ట్రలోని ఎంవీఏ కూటమి ప్రభుత్వం.. మూడు చక్రాల ఆటో లాంటిదని, శివసేన ముందు టైర్ కాగా, వెనుక భారాన్ని ఎన్సీపీ, కాంగ్రెస్ మోస్తాయని, మొత్తంగా స్టీరింగ్ మాత్రం మహారాష్ట్ర ప్రజల చేతుల్లోనే ఉంటుందని, అదే బీజేపీ నేతృత్వంలోని ఎన్టీఏ కూటమి మాత్రం 30 నుంచి 35 పార్టీల కలయికతో రైలు మాదిరిగా ఉంటుదని, ఏ బోగి ఎప్పుడు విడిపోతుందో తెలీదని వ్యాఖ్యానించారు.
అయోధ్య అంశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన మహా వికాస్ ఆగాధి ప్రభుత్వానికి ఢోకా లేదని ఉద్ధవ్ అన్నారు. ఆ మధ్య మధ్యప్రదేశ్ లో, ప్రస్తుతం రాజస్థాన్ లో జరుగుతున్నట్లే.. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కూలిపోతుందంటూ బీజేపీ నేతలు చేస్తోన్న కామెంట్లకు ఉద్ధవ్ ఘాటుగా కౌంటరిచ్చారు. దమ్ముంటే మా ప్రభుత్వాన్ని పడొట్టే ప్రయత్నం మొదలుపెట్టండి.. ఆ తర్వాత ఏమవుతుందో మీరే చూస్తారంటూ బీజేపీకి సవాలు విసిరారు.