సొంత కారు కూడా లేని సీఎం.. ఆయన ఆస్తులు,అప్పులు ఎంతో తెలుసా...
తొలిసారి ఎన్నికల బరిలో దిగిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే సోమవారం(మే 11) నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను ఉద్దవ్ వెల్లడించారు. తనకు,తన కుటుంబ సభ్యులకు స్థిరాస్తులు,చరాస్తులు కలిపి రూ.143.26కోట్లు ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. అదే సమయంలో తనకు సొంత కారు లేదని ఉద్దవ్ నామినేషన్ పత్రాల్లో పేర్కొనడం గమనార్హం. అలాగే రుణాలతో కలిపి రూ.15.50కోట్లు అప్పులు ఉన్నట్టు తెలిపారు. ఇందులో తన పేరు మీద రూ.4.06కోట్లు అప్పు, తన భార్య పేరు మీద రూ.11.44కోట్లు అప్పు ఉన్నట్టు చెప్పారు.
మొత్తం ఆస్తిలో రూ.76.56 కోట్లు తన పేరుపై,రూ.52.44 కోట్లు తన సతీమణి రష్మీ థాక్రే పేరుపై ఉన్నట్టు పేర్కొన్నారు. ఇందులో రూ.61,89,57,443 చరాస్తులు కాగా.. రూ.81,37,17,320 స్థిరాస్తులు అని తెలిపారు.ఇప్పటివరకూ తనపై 23 కేసులు ఉన్నట్టు తెలిపారు. అందులో సామ్నా పత్రికలో గీసిన కార్టూన్ల కారణంగా 14 కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. అయితే తన ఇద్దరు కుమారులు తన డిపెండెంట్స్ అని ఉద్దవ్ ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం.
అలాగే వారికి సంబంధించిన ఆస్తులు,అప్పుల వివరాలను కూడా ఆయన వెల్లడించలేదు. సీఎంగా వచ్చే వేతనం,వడ్డీలు,డివిడెంట్,కేపిటల్ గెయిన్స్ తన ఆదాయ వనరులుగా పేర్కొన్నారు. వడ్డీలు,అద్దెలు,కంపెనీల్లో షేర్స్,డివిడెంట్&కేపిటల్ గెయిన్స్ తన భార్య ఆదాయంగా పేర్కొన్నారు.
Recommended Video
కాగా, మే 21న రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మండలి స్థానాలకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సతీమణి రష్మీ థాక్రే, కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్యా థాక్రేతో కలిసి స్థానిక కార్యాలయంలో నామినేషన్ ప్రతాలను సమర్పించారు. ఉద్దవ్ థాక్రేకి ఇప్పటికే కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు ప్రకటించడంతో ఆయన ఎన్నికల ఏకగ్రీవం కానుంది. ఆయన పోటీ చేసే స్థానానికి ఇప్పటివరకూ ఆయన మాత్రమే నామినేషన్ వేశారు. దీంతో పోటీ లేకుండానే ఆయన గెలుపొందడం లాంఛనమే అని చెప్పాలి.