తండ్రి సీఎం-కొడుకు మంత్రి.. కేటీఆర్, లోకేశ్, స్టాలిన్.. ఇప్పుడు ఆదిత్య ఠాక్రే
దేశరాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కాంగ్రెస్కు అతిపెద్ద వారసత్వ పార్టీ అనే ముద్ర ఉంది. కానీ ఆ పార్టీని నడిపించే గాంధీ ఫ్యామిలీలో ఏ ఇద్దరు కూడా ఒకేసారి పదవిలో ఉన్న సందర్భాలు లేవు. నెహ్రూ చనిపోయిన తర్వాతగానీ ఇందిర గాంధీ.. ఆమె తదనంతరంగానీ రాజీవ్ గాంధీ ఉన్నత పదవులు చేపట్టలేదు. రాజీవ్ చనిపోయి 40 ఏండ్లు కావొస్తున్నా గాంధీ వారసులెవరూ ప్రభుత్వ పదవులు పొందలేదు. కాంగ్రెస్ ముచ్చట కాసేపు పక్కనపెడితే.. పలు రాష్ట్రాల్లో మాత్రం పొలిటికల్ డైనెస్టీ అప్రతిహతంగా సాగుతూనే ఉన్నది.
తాజాగా ఠాక్రే..
తమిళనాడులో కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు ఆయన కొడుకు స్టాలిన్ ప్రభుత్వంలోకి ఎంటరై, డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ను కేబినెట్ లోకి తీసుకున్నారు. కొద్దిగా ఆలస్యంగానైనా అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా పుత్రరత్నం లోకేశ్ బాబును ఎమ్మెల్సీ చేసిమరీ మంత్రివర్గంలో చేర్చుకున్నారు. తాజాగా మహారాష్ట్ర సీఎం పీఠమెక్కిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా తన కొడుకు ఆదిత్య ఠాక్రేను కేబినెట్ లోకి చేర్చుకున్నారు.
ప్రయత్నాలు ఫలించక..
మహారాష్ట్రలో ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచీ శివసేన సీఎం క్యాండేట్ గా ఆదిత్య ఠాక్రే పేరును తెరపైకి తెచ్చారు. బీజేపీతో పొత్తు బెడిసికొట్టిన తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీలతో మంతనాలు జరిపిన ఉద్దవ్.. కొడుకుకు సీఎంగిరీ ఇప్పించేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేసి విఫలమై చివరికి తానే సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పుడు పరిస్తితులు అనుకూలించడంతో కొడుకును క్యాబినెట్ లోకి తీసుకున్నారు. సోమవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆదిత్య మంత్రిగా ప్రమాణం చేశారు.
కొడుకు కోసం కొత్త పోస్టు..
కొడుకు ఆదిత్య ఠాక్రేను ఎలాగైనా సరే ‘కీలక' పదవిలో కూర్చోబెట్టాలనుకున్న ఉద్ధవ్ ఠాక్రే.. చక్కటి ప్లాన్ వేసినట్లు చర్చ నడుస్తున్నది. కేంద్రంలో ప్రధాన మంత్రి కార్యాలయ సహాయ మంత్రి (పీఎంవో మంత్రి) తరహాలోనే మహారాష్ట్రలోనూ ‘సీఎంవో మంత్రి' అనే కొత్త పోస్టును క్రియేట్ చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్, ఎన్సీపీలు అంగీకరిస్తాయా లేదా అన్నది వేచిచూడాలి.