'మహా' రాజకీయాల్లో మళ్లీ అలజడి... ప్రభుత్వం కూలుతుందా..? ఉద్దవ్ ఏం చేయబోతున్నారు..
కరోనా వైరస్ విజృంభిస్తున్న మహారాష్ట్రలో రాజకీయాలు కూడా వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కరోనా నియంత్రణలో మహా వికాస్ అఘాడీ సర్కార్ విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో సమన్వయం కొరవడిందని.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి కరోనాను అదుపులోకి తీసుకురావాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రపతి పాలనకు డిమాండ్ వినిపిస్తున్న తరుణంలోనే సంకీర్ణ సర్కార్లో లుకలుకలు బయటపడటం కలవరపెడుతోంది. దీంతో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే డ్యామేజ్ను పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రమాదంలో సీఎం పదవి: ప్రధాని మోడీకి మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఫోన్
భాగస్వామ్య పార్టీలతో ఏం చర్చించబోతున్నారు..
ఓవైపు పెరుగుతున్న కరోనా కేసులు.. మరోవైపు రాష్ట్రపతికి పాలనకు డిమాండ్.. ఇలాంటి తరుణంలో సంకీర్ణ ప్రభుత్వం బలంగా ఉండాలంటే భాగస్వామ్య పార్టీలు ఏకాభిప్రాయంతో పనిచేయాలని ఉద్దవ్ థాక్రే భావిస్తున్నారు. ఇదే అంశంపై చర్చించడానికి బుధవారం(మే 27)న ఆయన ఎన్సీపీ,కాంగ్రెస్ పార్టీలతో సమావేశం కాబోతున్నారు. అలాగే కరోనాను సాకుగా చూపించి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ తెర వెనుక వేస్తున్న ఎత్తుగడలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో లుకలుకలు ప్రభుత్వానికి మంచివి కాదని.. ఐక్యంగా ముందుకు సాగుతామని ఆయన భాగస్వామ్య పార్టీలను కోరే అవకాశం ఉంది.
అసలెందుకీ రచ్చ..
దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే 54,758 కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో కరోనాతో 1792 మంది మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ను మరికొంత కాలం పొడగించాలని ముఖ్యమంత్రి ఉద్దవ్ భావిస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య నేత అయిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ లాక్ డౌన్ను సడలించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకే ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపించడంతో.. సంకీర్ణ ప్రభుత్వంలో బేధాభిప్రాయాలు మొదలయ్యాయన్న ఊహాగానాలు తెర పైకి వచ్చాయి.
రాహుల్ వ్యాఖ్యలతో మరింత దుమారం...
ఉద్దవ్,శరద్ పవార్ల భిన్నాభిప్రాయాలకు తోడు మంగళవారం(మే 26) రాహుల్ చేసిన వ్యాఖ్యలు కూడా సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలను బయటపెట్టాయి. మహారాష్ట్రంలో తాము ప్రభుత్వానికి మద్దతునిస్తున్నాము తప్పితే.. నిర్ణయాలేవీ తమ చేతిలో లేవని చెప్పేశారు. దీంతో శివసేన,కాంగ్రెస్,ఎన్సీపీల మధ్య పూర్తిగా సమన్వయం కొరవడిందన్న విమర్శలు మొదలయ్యాయి. ఇదే తరుణంలో బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో భేటీ కావడం.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం మహా రాజకీయాల్లో అలజడి రేపింది.
Recommended Video
ప్రభుత్వాన్ని కాపాడుకుంటారా...?
ప్రభుత్వాన్ని కూల్చేయాలనే ప్రతిపక్ష కుట్రలను ఉద్దవ్,శరద్ పవార్లు పసిగట్టినట్టు చెబుతున్నారు. మంగళవారం భేటీ అయిన వీరిద్దరు పలు అంశాలపై చర్చించారు.భేటీ అనంతరం పవార్ మీడియాతో మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు ఓపిక తక్కువని,ఎప్పుడెప్పుడు ప్రభుత్వాన్ని కూల్చాలా అని ఆరాటపడుతున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం స్థిరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అటు శివసేన కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాజాగా మూడు భాగస్వామ్య పార్టీలు నేడు సమావేశం కాబోతుండటం మహా రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రత్యర్థులను తట్టుకుని ఉద్దవ్ తమ ప్రభుత్వాన్ని కాపాడుకుంటారా.. లేక మహా రాజకీయాలు మరో మలుపు తిరిగేందుకు అవకాశం ఇస్తారా అన్న ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది.