ఉద్దవ్ థాకరేను నమ్మలేం: ప్రఫుల్, శివసేన మంత్రులు రాజీనామా ఛాన్స్.. ఫడ్నవీస్కు చిక్కులు!
ముంబై: శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేను ఏమాత్రం నమ్మలేమని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ గురువారం అన్నారు. పాల్ఘర్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. కమలం పార్టీ చేతిలో శివసేన ఓడిపోయింది. ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలే అయినప్పటికీ బరిలోకి దిగాయి. పాల్ఘర్లో తన ఓటమిని శివసేన స్వీకరించలేదు. ఏదో తేడా జరిగిందని అనుమానిస్తోంది.
ఇందులో భాగంగా ఉద్ధవ్ థాకరే బీజేపీపై, ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ స్పందించారు. ఉద్దవ్ థాకరే చెప్పింది వాస్తవమేనని, కానీ ఆయన మాటలను ఎవరూ విశ్వసించరని వ్యాఖ్యానించారు. బీజేపీతో కలిసి ఉన్నంత వరకు ఆయనను ప్రజలు నమ్మలేరని వ్యాఖ్యానించారు. మొదట ఆయన ఎన్డీయే నుంచి బయటకు రావాలన్నారు. అప్పుడే ఉద్దవ్ థాకరేను అందరూ నమ్ముతారని చెప్పారు.
రంగంలో శివసేన, మొదటిసారి కలిసిన కాంగ్రెస్-ఎన్సీపీ: మహారాష్ట్రలో గెలుపు బీజేపీకి కీలకం, కారణాలు ఇవీ
తన మంత్రులను రాజీనామా చేయమనే అవకాశం
బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉద్దవ్ థాకరే దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలోని తమ మంత్రులను రాజీనామా చేయమని చెప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీపై చాలా రోజులుగా శివసేన ఆగ్రహంతో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని, ఎన్డీయేతో కలవమని చెప్పారు. అయితే అప్పటి దాకా ఫడ్నవీస్ ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. పాల్ఘర్ ఎన్నికల నేపథ్యంలో ఆయన తన మంత్రులను రాజీనామా చేయమని చెప్పే అవకాశాలున్నాయి. అదే జరిగితే మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వానికి చిక్కులే.