ప్రమాదంలో సీఎం పదవి: ప్రధాని మోడీకి మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఫోన్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఓవైపు కరోనావైరస్ విజృంభిస్తుంటే.. మరోవైపు రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుండానే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, నిబంధనల ప్రకారం 6 నెలల్లో రెండింటిలో ఏదైనా సభకు ఎన్నిక కావాల్సి ఉంది. లేదంటే సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన వస్తుంది.
గవర్నర్కు విన్నవించినా..
ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం శాసనమండలిలో నామినేటెడ్ సభ్యత్వానికి సీఎం ఉద్ధవ్ పేరును సిఫారసు చేస్తూ గవర్నర్కు లేఖ పంపింది. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు నియమించిన గవర్నర్ భగత్ సింగ్ కొశియారీ ఆ సిఫారసుపై తాత్సారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్కంఠ ఏర్పడింది.
ప్రధాని మోడీకి ఉద్ధవ్ ఫోన్..
మహారాష్ట్రలో మరోసారి రాజకీయ అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. ఈ వ్యవహారంలో కలగజేసుకోవాలని కోరారు. తనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసేలా చూడాలని కోరారు. లేదంటే మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొంటుందని చెప్పారు.
Recommended Video
ఆసక్తికరంగా మారిన పరిస్థితి..
నవంబర్ 28, 2019న మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో మే నాటికి ఆరు నెలలు పూర్తయ్యే అవకాశం ఉండటంతో.. రాష్ట్రమంత్రివర్గం శాసనమండలిలో నామినేటెడ్ సభ్యత్వానికి సీఎం ఉద్ధవ్ ను పేరును సిఫారసు చేస్తూ గవర్నర్ లేఖ పంపింది. గవర్నర్ ఆమోదం తెలిపేందుకు తాత్సారం చేస్తుండటంతో ప్రధానిని సంప్రదించాల్సిన అవసరం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇది ఇలావుంటే, మహారాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 10వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.