ఇంకా ఎన్నేళ్లు.. రామమందిరంపై ఆర్డినెన్స్ తేండి, మద్దతిస్తాం: ఉద్ధవ్ థాకరే, అయోధ్యలో 144వ సెక్షన్
అయోధ్య: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిద్రపోతోందని శివసేన అధినేత ఉద్దవ్ థాకరే నిప్పులు చెరిగారు. గత కొంతకాలంగా బీజేపీ, శివసేనల మధ్య దూరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్దవ్ అయోధ్యలో పర్యటించి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
అయోధ్యలో రామమందిర పనుల ప్రారంభ తేదీని చెప్పి తీరాల్సిందేనని థాకరే అన్నారు. ఆలయంపై చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అయోధ్య అంశంపై మోడీ సర్కార్ నిద్రపోతోందన్నారు. ఆయన భార్య, కొడుకుతో ఆదివారం ఉదయం రాంలల్లా ఆలయాన్ని సందర్శించారు. పుణే శివనేరి కోట నుంచి తెచ్చిన మట్టిని పూజారికి అందించారు.
రామ మందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ తెస్తే తామూ మద్దతిస్తామని చెప్పారు. రామమందిరం చుట్టూ అంతమంది పోలీసులను చూస్తే బాధగా అనిపిస్తోందన్నారు. ఆర్డినెన్స్ తేవడానికి అడ్డంకులు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. తమ అయోధ్య పర్యటన వెనుక ఎలాంటి రహస్య అజెండా లేదని చెప్పారు. అయోధ్యను అందరూ ఎన్నికల అస్త్రంగా వాడుకుంటున్నారని చెప్పారు. అయోధ్యలో ఆలయాన్ని కట్టడానికి ఇంకా ఎన్నేళ్లు తీసుకుంటారన్నారు.
ఉద్ధవ్ థాకరే శనివారం మధ్యాహ్నం తన భార్య రష్మి, కొడుకు ఆదిత్యలతో కలిసి అయోధ్య చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం సరయు నది ఒడ్డున పూజలు చేయనున్నారు. వేలాదిమంది శివసైనికులు అయోధ్యకు బయలుదేరారు.
యూపీలోని అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలన్న డిమాండుతో విశ్వహిందూ పరిషత్, శివసేనలు ధర్మసభలకు పిలుపునిచ్చాయి. ఆదివారం సభ నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
అయోధ్య రామమందిర అంశం మరోసారి రాజకీయాలను వేడెక్కిస్తోంది. థాకరే పర్యటన, వీహెచ్పీ సభ నేపథ్యంలో ఈ అంశం మరోసారి రాజుకుంది. వీహెచ్పీ నిర్వహించనున్న సభ కోసం పెద్ద ఎత్తున రామభక్తులు అయోధ్యకు వచ్చారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. 700 మంది పోలీసులు, 42 కంపెనీల పీఏసీ బలగాలు, 5 కంపెనీల ఆర్ఏఎఫ్, ఏటీఎస్ కమాండోలను, డ్రోన్లను మోహరించారు.