ఆర్యన్ ఖాన్ కేసుపై ఉద్ధవ్ వ్యాఖ్యలు-సెలబ్రిటీలపైనే ఎన్సీబీ కన్ను-ముంద్రా కేసుకు పోలిక
మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తొలిసారి స్పందించారు ఇన్నాళ్లూ ఈ వ్యవహారంపై మౌనంగా ఉండిపోయిన మహారాష్ట్ర సీఎం.. ఇవాళ తొలిసారి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
ఆర్యన్ ఖాన్ కేసు వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అత్యుత్సాహం చూపుతోందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పరోక్షంగా వ్యాఖ్యానించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు సెలబ్రిటీల్ని పట్టుకోవడంలో ఎక్కువగా ఆసక్తి ఉందని థాక్రే ఆరోపించారు. ఎన్సీబీ పట్టుకున్న డ్రగ్స్ గ్రాముల్లోనే ఉన్నాయని, కానీ ముంబై పోలీసులు 150 కోట్ల విలువైన డ్రగ్స్ ముంద్రా పోర్టులో పట్టుకున్నారని థాక్రే గుర్తు చేశారు. ఎన్సీబీకి సెలబ్రిటీల్ని పట్టుకోవడం, వారిని ఫొటోలు తీసుకోవడం, దీన్ని రచ్చచేయడంపైనే ఎక్కువగా ఆసక్తి ఉందని థాక్రే వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర డ్రగ్ రాజధానిగా ఉందనేలా వారు తయారు చేశారని ఎన్సీబీపై ఉద్ధవే థాక్రే మండిపడ్డారు. ఇది (ఆర్యన్ ఖాన్ ) కేసే కాదని, ముంద్రా పోర్టులో దొరికిన డ్రగ్స్ కోట్లు విలువ చేసేవని, మీరు (ఎన్సీబీ) గుప్పెడు గంజాయి పట్టుకున్నారని, కానీ ముంబై పోలీసులు రూ.150 కోట్ల హెరాయిన్ పట్టుకున్నారని ధాక్రే గుర్తు చేశారు. ఇది మహారాష్ట్ర పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే కుట్ర అని, దీన్ని డ్రగ్స్ కు అడ్డాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని థాక్రే అన్నారు. ఇలాంటి డ్రగ్స్ కేసుల వల్ల మహారాష్ట్రను ప్రజలు భూతద్దంలో చూసే పరిస్దితి వస్తుందని, మమ్మల్ని టార్గెట్ చేస్తున్న వారు రేప్ లు, హత్యలు జరుగుతున్న ఉత్తర్ ప్రదేశ్ ను ఎందుకు ప్రశ్నించడం లేదని థాక్రే నిలదీశారు.