గవర్నర్కు రుజువుల సమర్పణ: 28నే మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణం
ముంబై: ముఖ్యమంత్రి అభ్యర్థి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మంగళవారం రాత్రి రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిశారు. ఆయన వెంట శివసేనతోపాటు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలతోపాటు ఆ మూడు పార్టీల లేజిస్లేటచర్ పార్టీ నేతలు కూడా ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు.
గవర్నర్కు రుజువులు
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్కు పత్రాన్ని సమర్పించామని శివసేన నేత ఒకరు తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు ఎమ్మెల్యేల బలముందని రుజువులు కూడా చూపించామని వెల్లడించారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.
నవంబర్ 28నే
నవంబర్ 28న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని శివసేన నేత తెలిపారు. మొదట డిసెంబర్ 1న అనుకున్నప్పటికీ కొంచెం ముందుకు జరిగి నవంబర్ 28న ఉద్ధవ్ థాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. సెంట్రల్ ముంబైలోని శివాజీ పార్కులో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
కలలో కూడా అనుకోలేదంటూ..
ఇది ఇలావుండగా, శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమికి సరికొత్త పేరును పెట్టారు. `మహా వికాస్ అఘాడి అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించారు. దీనితో పాటు పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని కూటమి నాయకులు వెల్లడించారు. మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలనే విషయంపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చినందున.. దీనిపై ఎలాంటి చర్చలు లేవని తెలిపారు. మహా వికాస్ అఘాడి నేతగా, ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా తన పేరును ఏకగ్రీవంగా ఆమోదించిన వెంటనే ఉద్దవ్ థాకరే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ ఉద్వేగంతోనే ఆయన ప్రసంగించారు. తాను ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠిస్తానని కలలో కూడా అనుకోలేదని అన్నారు. భారతీయ జనతా పార్టీతో 30 సంవత్సరాల పాటు కొనసాగిన మైత్రీ బంధాన్ని ఎందుకు తెంచుకోవాల్సి వచ్చిందో ఆయన వివరించారు.