మహారాష్ట్రలో థాకరే శకం: ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణం: మరో ఆరుమంది..!
ముంబై: మహారాష్ట్రలో థాకరే శకం ఆరంభమైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ పార్కులో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారితో ఆయన ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు చెందిన హేమాహేమీల వంటి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో గురువారం సాయంత్రం సరిగ్గా 6:40 నిమిషాలకు ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు.
థాకరేల కుటుంబం నుంచి తొలి నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. 50 సంవత్సరాల పాటు మహారాష్ట్ర రాజకీయాలపై ఆధిపత్యాన్ని చలాయిస్తున్నప్పటికీ.. థాకరేల కుటుంబానికి చెందిన వారెవరూ ఇప్పటిదాకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు.
#WATCH Uddhav Thackeray takes oath as Chief Minister of Maharashtra. #Mumbai pic.twitter.com/pKaAjqYvWM
— ANI (@ANI) November 28, 2019
ఆ లోటును ఉద్ధవ్ థాకరే భర్తీ చేసినట్టయింది. మహారాష్ట్రకు ఆయన 19వ ముఖ్యమంత్రి. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఉద్ధవ్ థాకరే.. గవర్నర్ సహా అహూతులను నమస్కరించారు.
థాకరేతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాలా సాహెబ్ థొరట్, నితిన్ రౌత్, శివసేన నుంచి ఏక్ నాథ్ షిండే, దివాకర్ రౌతె, ఎన్సీపీ నుంచి ఛగన్ భుజ్ బల్, జయంత్ పాటిల్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా నిర్దేశించిన విధంగా ఉద్ధవ్ థాకరే మినహా ఆరుమందితో మంత్రివర్గం ఏర్పాటైనట్టయింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల నుంచి ఇద్దరు చొప్పున శాసన సభ్యులకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అనంతరం మంత్రివర్గాన్ని విస్తరిస్తారు.