మహా సీఎంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారానికి మోడీ,అమిత్ షా లకు ఆహ్వానం ? ఆసక్తికర చర్చ
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్న కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి చీఫ్ అమిత్ షా ను సైతం ఆహ్వానిస్తామని చెప్పారు శివసేన నేత సంజయ్ రౌత్.ఆయన చమత్కారంగా చెప్పినా ఇప్పుడే అదే రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు సాయంత్రం 6.40 నిముషాలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీని పిలుస్తున్నారా? అన్న ప్రశ్నకు ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఈ విషయంలో తమకు ఎటువంటి పట్టింపులు లేవని, ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాను కూడా పిలుస్తామని బదులిచ్చారు. మహారాష్ట్రలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా సాగిన రాజకీయాలు గత నాలుగు రోజుల నుండి దేశం దృష్టిని ఆకర్షించాయి. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారంతో ఒక్కసారిగా శరవేగంగా మారిన రాజకీయాలు మూడు రోజుల్లో అంతే వేగంగా మరోమారు మారాయి.
అయితే, బలనిరూపణకు అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో ఆయన మూడు రోజుల 8గంటల ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. 23న ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజులకే ఫడ్నవీస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.
కాంగ్రెస్ మరియు ఎన్సిపి మహారాష్ట్రలో సైద్ధాంతికంగా శివసేన భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యనుంది. ఈ కార్యక్రమం ముంబైలోని ఐకానిక్ శివాజీ పార్క్లో జరుగుతుందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి మేము అందరినీ ఆహ్వానిస్తాము, మేము మోడీ, అమిత్ షాను కూడా ఆహ్వానిస్తాము" అని సంజయ్ రౌత్ చమత్కరించారు. ఇప్పుడే అదే చర్చ జరుగుతుంది.