మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే పేరు ఖరారు!: డిప్యూటీ సీఎంల రేసులు వీరే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. సుప్రీంకోర్టు బుధవారం బలనిరూపణ చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి వేరే మార్గం లేక చేతులెత్తేసింది. అంతకుముందే డిప్యూటీ సీఎం, ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
మహారాష్ట్ర నుంచే బీజేపీ పతనం: కూటమికి సమాజ్ వాది పార్టీ బేషరతు మద్దతు
రాజీనామా చేసిన ఫడ్నవీస్
ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు భగత్ సింగ్ కోశ్యారికి అందజేశారు. దీంతో నాలుగు రోజుల్లోనే బీజేపీ ప్రభుత్వం ముగిసిపోయింది. అజిత్ పవార్ తన వద్ద తగిన ఎమ్మెల్యేల బలం ఉందని చెప్పడంతోనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం మీడియాకు తెలిపారు.
సీఎంగా ఉద్ధవ్ థాక్రే..
కాగా, సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయడంతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మంగళవారమే ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే పేరును ప్రకటిస్తామని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. ఈ సాయంత్రం మూడు పార్టీల మీడియా సమావేశంలో ఖరారు చేస్తామని చెప్పారు.
ఉద్ధవ్ థాక్రేను గవర్నర్ ఆహ్వానించాలి..
దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాకు ఆమోదం తెలిపి.. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే తాము గవర్నర్ను కోరామని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ఉద్ధవ్ థాక్రేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పిలవాలని గవర్నర్ను కోరుతున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ కూటమి తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే.
డిప్యూటీ సీఎం రేసులో పృథ్వీరాజ్.. అశోక్ చవాన్, ఎన్సీపీ నుంచి జితేందర్
ముఖ్యమంత్రి పదవిని ఉద్ధవ్ థాక్రే చేపట్టే అవకాశం ఉండగా, డిప్యూటీ సీఎంలుగా అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేను ఎన్నుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఎంలు అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్లు, సీనియర్ నేత బాలా సాహెబ్ డిప్యూటీ సీఎం రేసులో ఉన్నారని చెప్పారు. ఇక ఎన్సీపీ నుంచి జితేందర్ అహ్వద్ కూడా డిప్యూటీ సీఎం రేసులో ఉన్నారని తెలుస్తోంది. ఎన్సీపీలో ఈయన ఓబీసీ నేత, మరాఠా కాని వ్యక్తి కావడం గమనార్హం.