ఉద్ధవ్ థాక్రే-జితిన్ వరకు: బలనిరూపణకు ముందే రాజీనామా చేసిన ముఖ్యమంత్రులు వీరే
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బుధవారం రాత్రి శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు. జూన్ 30న ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం బలనిరూపణ పరీక్ష ఎదుర్కోవాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో ఆయన తన రాజీనామా ప్రకటించారు. ఇలా బలనిరూపణకు ముందే రాజీనామా చేసిన ముఖ్యమంత్రుల వివరాల్లోకి వెళితే..
Recommended Video
బలనిరూపణకు ముందే సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా
అంతకుముందు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ థాక్రేను కోరారు. ఈ నేపథ్యంలోనే శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే, సుప్రీంకోర్టు మాత్రం గురువారం అసెంబ్లీలో ప్రభుత్వం బలం నిరూపించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే, బల నిరూపణకు ముందే ఉద్ధవ్ థాక్రే బుధవారం రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో బల పరీక్షకు ముందు రాజీనామా చేసిన సీఎంల జాబితాలో ఉద్ధవ్ కూడా చేరిపోయారు.
కమల్నాథ్, మధ్యప్రదేశ్(మార్చి 20, 2020)
మార్చి 20, 2020: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ కూడా సుప్రీంకోర్టు రాష్ట్ర అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షకు ఆదేశాలివ్వడంతో తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి తగిన సంఖ్యా బలం లేకపోవడంతో కమల్ నాథ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈయన కూడా బలపరీక్షకు వెళ్లకుండానే రాజీనామా చేశారు.
తనకు పార్టీలో తగిన గౌరవం లేదంటూ కాంగ్రెస్ రెబల్ నేత జ్యోతిరాదిత్య సింధియా మార్చి 10, 2020లో బీజేపీలో చేరారు. దీంతో ఆయనకు మద్దతుగా 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ క్రమంలో కమల్ నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. దీంతో కమల్ నాథ్ బలపరీక్షకు ముందే రాజీనామా చేశారు.
80 గంటల్లోనే దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర
నవంబర్ 26,2019: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన 80 గంటల్లోనే తన పదవికి రాజీనామా చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. బీజేపీకి మద్దతు పలికిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వ్యక్తిగత కారణాలు చెప్పి రాజీనామా చేయడంతో సీఎం కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అజిత్ పవార్ రాజీనామా చేశారు.. మా వద్ద బలం లేదు, హార్స్ రైడింగ్ చేయలేము అందుకే నేను రాజీనామా చేస్తున్నా అని దేవేంద్ర ఫడ్నవీస్ బలనిరూపణకు ముందే రాజీనామా చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ప్రభుత్వం ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు జరిగి, ఉద్ధవ్ థాక్రే సీఎంగా డిక్లేర్ అయిన తర్వాత అజిత్ పవార్ బీజేపీ వైపునకు వెళ్లడం అప్పుడు సంచలనంగా మారింది. అయితే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చొరవతో అజిత్ పవార్ వెనక్కి తగ్గడంతో అప్పుడు బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది.
బీఎస్ యడ్యూరప్ప రెండ్రోజులు, కర్ణాటక(మే 19, 2018)
మే 17, 2018న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీఎస్ యడ్యూరప్ప.. మే 19న తన పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి తగిన మెజార్టీ లేకపోవడంతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేయక తప్పలేదు. రాజీనామా చేసే ముందు అసెంబ్లీలో యడ్యూరప్ప మాట్లాడుతూ.. బీజేపీకే ఎక్కువ సీట్లు ఉన్నాయి.
104 స్థానాల్లో గెలిపించి కర్ణాటక ప్రజలు తమను ఆశీర్వదించారు. కాంగ్రెస్ లేదా జేడీఎస్కు ప్రజల మద్దతు లేదని అన్నారు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే, జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
నబంటుకి, అరుణాచల్ ప్రదేశ్
జులై 16, 2016: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జులై 13న నబంటుకి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి ఏర్పాటైంది. అయితే, కోర్టు తీర్పు నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ తాథగత్ రాయ్ అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని నబంటుకి స్పష్టం చేశారు. దీంతో తగిన మెజార్టీ లేకపోవడంతో జులై 16న బలనిరూపణకు గంటల ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు నబంటుకి.
జితిన్ రామ్ మాంఝీ, బీహార్
ఫిబ్రవరి 20, 2015: అసెంబ్లీలో బలనిరూపణకు ముందే బీహార్ ముఖ్యమంత్రి పదవికి జితిన్ రామ్ మాంఝీ రాజీనామా చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవికి నితీష్ రాజీనామా చేయడంతో.. మాంఝీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాత మాంఝీకి, నితీష్ కుమార్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో మాంజీని జేడీయూ పార్టీ నుంచి తొలగించారు. ఈ క్రమంలో బలం నిరూపించుకోలేకపోయిన మాంఝీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.