ట్విట్టర్ మార్పుతో అజిత్ ‘పవర్’ జోష్.. మనదే ప్రభుత్వం అంటూ ఉద్దవ్, వేడెక్కిన ముంబై పాలిటిక్స్
మహారాష్ట్రలో రాజకీయ ఆధిపత్యం దిశగా అన్నీ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, గవర్నర్ నిర్ణయం తప్పు అని నిరూపించడానికి ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటే.. మరో పక్క ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు బీజేపీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సుప్రీం కోర్టు విచారణ, తీర్పు సోమవారం వెల్లడి కానున్న నేపథ్యంలో బల పరీక్షలో ఫడ్నవీస్ను ఓడించేందుకు కూటమి అడుగులేస్తున్నది. దాంతో ముంబైలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వివరాల్లోకి వెళితే..
క్యాంపు రాజకీయాల జోరు
ముంబైలోని హోటళ్లలో ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు జోరందుకొన్నాయి. హోటల్ రినాయిసెన్స్లో ఎన్సీపీ ఎమ్మెల్యేలు, జేడబ్ల్యూ మారియట్ హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో దూతలు మల్లికార్జున్ ఖర్గే, అశోక్ చవాన్ భేటీ అయ్యారు. ఇక లలిత్ హోటల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా శివసేన పార్టీ చర్యలు తీసుకొంటున్నది.
మనదే సుస్థిర ప్రభుత్వం
కాగా, ఆదివారం మధ్యాహ్నం రినాయిసెన్స్ హోటల్లో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశానికి అధినేత శరద్ పవార్ హాజరయ్యారు. ఈ సమావేశానికి ఉద్దవ్ థాకరే, సంజయ్ రౌత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్దవ్ థాకరే మాట్లాడుతూ.. ఎలాంటి ఆందోళన చెందవద్దు. మన బంధం సుదీర్ఘంగా సాగుతుంది. మెజారిటీకి సరిపోయే సంఖ్య మనకు ఉంది. మనం సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని అన్నారు.
సహనం పాటించాలని శరద్ పవార్
ఎన్సీపీ ఎమ్మెల్యేలతో శరద్ పవార్ వ్యక్తిగతం కూడా మాట్లాడినట్టు సమాచారం. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడంలో ఆయన సఫలమైనట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమయంలో సంయమనం, సహనం పాటించాలని పార్టీ ఎమ్మెల్యేలకు శరద్ పవార్ సూచించినట్టు తెలిసింది.
అజిత్ ట్విట్టర్ బయో మార్పు
ఇక ఓ వైపు కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ తమ ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. అజిత్ పవార్ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న హోదాను మార్చి డిప్యూటీ సీఎం అని తన ట్విట్టర్ బయోను మార్చుకోవడం జరిగింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా శనివారం ఆయన ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.