పాకిస్థాన్ ను ముక్కలు ముక్కలు చెయ్యండి: మీ వెంట మేం ఉన్నాం ఉద్దవ్ థాక్రే !
భారత సైనికుల తలలు నరికిన పాకిస్థాన్ ను ముక్కలు ముక్కలు చెయ్యాలని శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ప్రధాని నరేంద్ర మోడీకి మనవి చేశారు.
ముంబై: భారత సైనికుల తలలు నరికిన పాకిస్థాన్ ను ముక్కలు ముక్కలు చెయ్యాలని శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ప్రధాని నరేంద్ర మోడీకి మనవి చేశారు. పాకిస్థాన్ లోకి వెళ్లి అక్కడి సైనికులు, ఉగ్రవాదులను ముక్కలు ముక్కలు చేసి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.
బీజేపీ నాయకులు కేవలం పార్టీనే కాకుండా దేశాన్ని కూడా పటిష్టం చెయ్యవలసిన అవసరం వచ్చిందని గుర్తు చేశారు. పాకిస్థాన్ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా సరే ప్రధానికి మద్దతుగా శివసేన ఉంటుందని ప్రజల సాక్షిగా చెప్పారు.
శివసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్దవ్ థాక్రే మాట్లాడారు. మే 1వ తేదీన పాకిస్థాన్ సైన్యం ఇద్దరు బారత సైనికులను అత్యంత పాశవికంగా హత్య చేసిందని, ఇది భారతదేశం మొత్తం ఖండించాలని అన్నారు. ఉత్తరప్రదేశ్ లో యోగి ప్రభుత్వం ఉంటే మహారాష్ట్రలో నిరుపయోగి ప్రభుత్వం ఉందని సొంత కూటమి మీద మండిపడ్డారు.
మహారాష్ట్రలో ఇలాంటి పనికిరాని ప్రభుత్వం ఉంటుందని తాను కలలో కూడా ఊహించలేదని ఇదే సమయంలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి షాక్ ఇచ్చారు. మహారాష్ట్రలో ఎవరైనా రైతులకు మద్దతుగా మాట్లాడితే వారిని ప్రభుత్వ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని ఉద్దవ్ థాక్రే విరుచుకుపడ్డారు.