ఉడిపి స్వామీజీ మృతి కేసు: మఠంలో మద్యం, కాండోమ్ లు, సీసీ కెమెరా డీవీఆర్ సీజ్!
బెంగళూరు: ఉడిపి శిరూరు మఠం శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీ అనుమానాస్పద మృతి కేసు కొత్త మలుపు తిరుగుతోంది. మఠంలో పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఉడిపి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 7 ప్రత్యేక బృందాలు విచారణ ముమ్మరం చేశాయి. అనుమానంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మఠంలో మాయం అయిన సీసీ కెమెరాల డీవీఆర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎక్కడస్వామీజీ ప్రత్యేక గది
శిరూరు మఠంలో శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీకి ప్రత్యేక గది ఉంది. ఆ గదిలోకి స్వామీజీ మినహా ఎవ్వరూ లోపలికి వెళ్లరు. మఠంలోని సిబ్బందిని వెంట పెట్టుకుని పోలీసులు స్వామీజీ గదిలో సోదాలు చేస్తున్నారు. స్వామీజీ గదిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
మద్యం, కాండోమ్ లు
మఠంలోని శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ గదిలో పోలీసులు భారీగా మద్యం బాటిళ్లు, కాండోమ్ లు, శానిటరీ ప్యాడ్లు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. మఠం ఆవరణంలోని బావిలో ఖాళీ మద్యం బాటిళ్లు స్వాదీనం చేసుకున్నారు. బావిలో ఉన్న వస్తువులు అన్నీ బయటకు తీయ్యడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మహిళ కుమారుడు
శిరూరు మఠం శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీ అనారోగ్యంతో మరణించలేదని, హత్య చేసి ఉంటారనే ప్రచారానికి బలం చేకూరుతోంది. స్వామీజీకి చాల సన్నిహితంగా ఉంటున్న మహిళ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
డీవీఆర్ స్వాధీనం
శిరూరు మఠంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల డీవీఆర్ చోరీ అయిన విషయం తెలిసిందే. స్వామీజీకి పరిచయం ఉన్న మహిళ కుమారుడు తన స్నేహితులతో కలిసి డీవీఆర్ ను చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడని సమాచారం. మహిళ కుమారుడితో సహ ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
స్వామీజీ కొడుకు ?
తనకు పిల్లలు ఉన్నారని గతంలో శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ బహిరంగంగా చెప్పారు. స్వామీజీకి పరిచయం ఉన్న మహిళ కుమారుడే స్వామీజీ కుమారుడా ? అనే అనుమానాలు ఇప్పుడు మొదలైనాయి. స్వామీజీకి మహిళకు ఉన్న సంబంధం ఏమిటీ, ఆమె కుమారుడు డీవీఆర్ ఎందుకు చోరీ చేశాడు, బుర్కా వేసుకుని రమ్యా శెట్టి ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించింది అని పోలీసులు ఆరా తీస్తున్నారు.