ఉఫ్..ఉఫ్.. సిగరెట్లకు బానిసలౌతున్న యువత..! జోష్ పేరుతో యాష్ అవుతున్న జీవితాలు..!!
హైదరాబాద్ :ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు మసి.. మరో వైపు పొగ.. ఎవరూ మాట్లాడరేం.. కాలే బీడీ సిగరెట్ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి.. ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు తప్పకుండా వచ్చే ప్రకటన. ప్రకటన చూడడమే తప్ప పొగరాయుళ్లలో ఎటువంటి చలనం కలగడం లేదు. కాల్చే సిగరెట్లో నికోటిన్ విషతుల్యమైన మత్తు పదార్ధం ఉంటుంది. సిగరెట్, బీడీ తాగే వారిలో ఈ విషం శరీరాన్ని పీల్చిపిప్పి చేస్తుంది. నేటి యువత ధూమపానాన్ని క్రేజీగా భావిస్తూ అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటోంది. పొగతాగడం వ్యసనంగా మారితే ప్రాణాన్నే హరిస్తుందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.
361 కోట్ల ఫీజు బకాయిలు..! చదువులు ముందుకు సాగేదెలా అమాత్యా..??
ఈ నగరానికి ఏమైంది..? ఈ యువతకు ఎందుకు ఆ పిచ్చి పట్టుకుంటోంది...?
పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రసార మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. సిగరెట్ ప్యాకెట్పైనే ప్రాణాంతకం అంటూ రాసుంటుంది. అయినా పొగతాగేవారు వాటిని అసలు పట్టించుకోవడం లేదు. ఆరోగ్యం విషవాయువుల నడుమ హరిస్తున్నా.. పొగతాగే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. నేటి యువత ధూమపానాన్ని క్రేజ్గా భావి స్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధం విధించినా చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు.
పొగ వల్ల అనర్దాలు ఎన్నో..! ఐనా బానిసలవుతున్న టీనేజర్లు..!!
పొగ పీల్చగానే నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. మనం పీల్చే గాలిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ శరీరానికి అందుతుంది. హానికర కార్బ న్ డైయాక్సైడ్ ఇతరత్రా వాయువులు విడిపోతాయి. ఆక్సిజన్ను హిమోగ్లోబిన్ పీల్చుకుని మిగిలిన వాయువులను బయటకు పంపుతుంది. పొగ తాగడం వల్ల శరీరంలోని కార్బన్ మోనాక్సైడ్, సైనైడ్ వంటి విష పదార్థాలు గాలి గదిలో చేరి హిమోగ్లోబిన్తో గాఢమైన బంధాన్ని ఏర్పరుచుకుంటాయి. దీంతో హిమోగ్లోబిన్కు ఆక్సిజన్ మోసుకుపోయే సామర్ధ్యం తగ్గి కార్బన్ మోనాక్సైడ్తో కణాలు విషపూరితమవుతాయి. ఫలితంగా పలు వ్యాధులు సోకుతాయి.
కాల్చే వారికే కాదు..! పీల్చేవారికీ ప్రమాదమే..!!
పొగ తాగేవారి కంటే పీల్చే వారు తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పొగతాగేవారిని యాక్టివ్ స్మోకర్గా, పీల్చేవారిని పాసివ్ స్మోకర్గా పిలుస్తారు. పొగ తాగేవారితో పాటు పీల్చేవారు కూడా పలు రకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పొగ పీల్చడం వల్ల మహిళల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. ఎక్కువ పీల్చడం వల్ల అబార్షన్లు జరగడం, ఒక వేళ పిండం ఎదిగినా చివర్లో మృత శిశువులు జన్మించడం వంటి సమస్యలు మహిళలను వేధించే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 2.5 కోట్ల మంది పొగతాగే వారున్నట్లు అంచనా. ఒక సిగరెట్ తాగితే 43 రకాల విష వాయువులు వెలువడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ అలవాటు ఉన్న వారు మానేస్తే, 20 ఏళ్ల తరువాత లంగ్స్ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఎన్నో మార్గదర్శకాలు..! కాని అమలుకు నోచుకోని చట్టాలు..!!
పొగ తాగేవారిలో నోటి, గొంతు సమస్యలు ఉత్పన్నమవుతాయి. గొంతులో ఉండే ప్రతి అవయవమూ పొగబారినపడి క్యాన్సర్కు లోనయ్యే ప్రమాదం వుంది. పొగతాగే వారిలో గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడంపై చట్టాలు ఉన్నా అవి పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదు. బహిరంగంగా పొగ తాగుతూ అధికారులకు పట్టుబడితే తొలిసారి రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా.. రెండో సారి పట్టుబడితే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా.. ఒక్కో సందర్భంలో రెండు శిక్షలు అమలు చేయవచ్చు. ఈ చట్టం ఆచరణలో విఫలమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ 2014లో చట్టంలో నిబంధనలు మార్చాలని భావించి మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. దీని ప్రకారం ధూమపాన సేవనానికి ఉన్న వయోపరిమితిని 18 నుంచి 25 ఏళ్లుగా చేసింది. నిబంధన అమలుకు నోచుకోలేదు. 2003లో పొగాకు నిషేధ చట్టం ప్రకారం విశ్వ విద్యాలయాల్లో వంద గజాల దూరంలో ఎలాంటి పొగాకు విక్రయ కేంద్రాలు ఉండకూడదు.