మోడీ నివాసం వద్ద యూఎఫ్ఓ చక్కర్లు: ప్రమాదమేమీ లేదన్న భద్రతా దళాలు
న్యూఢిల్లీ: ఎప్పుడూ ఇతర దేశాల్లోనే కనిపించే యూఎఫ్ఓ(గుర్తుతెలియని ఎగిరే సాసర్ లాంటి వస్తువు)లు ఇప్పుడు భారతదేశంలో కూడా కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి దగ్గరే కావడం గమనార్హం.
జూన్ 7న రాత్రి 7.30గంటల ప్రాంతంలో న్యూఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసమైన 'లోక్ కళ్యాణ్ మార్గ్' వద్ద ఆకాశంలో ఒక గుర్తు తెలియని వస్తువు తిరగడం చూశామని సీనియర్ సెక్యూరిటీ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే ఆ వస్తువెంటో తెలుసుకుందామని ప్రయత్నించామని, కానీ దాని గురించి ఎటువంటి సమాచారం దొరకలేదని తెలిపారు.
ఈ క్రమంలో భద్రతా అధికారులు ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన నివేదికలో 'అంతా సవ్యంగానే ఉంది'అని తెలిపారన్నారు. ఈ విషయం గురించి ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర పథక్ మాట్లాడుతూ.. 'ప్రధాని నివాసం వద్ద ఏదో గుర్తుతెలియని వస్తువు ఆకాశంలో చక్కర్లు కొట్టడం అయితే వాస్తమే. కానీ తర్వాత జరిపిన భద్రతా తనిఖీల్లో ప్రమాదకరమైనదేది మా దృష్టికి రాలేదు' అని తెలిపారు.
అంతేగాక భద్రతా కారణాల దృష్ట్యా అది యూఎఫ్ఓనా లేకా మరేదైన వస్తువా అనే విషయం గురించి మాత్రం తాము బయటకు వెల్లడించలేమని తెలిపారు. కాగా, గత అక్టోబర్లో ఓ రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో డ్రోన్లాంటి వస్తువేదో పార్లమెంట్ భవనం చుట్టూ చక్కర్లు కొట్టినట్లు ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం వచ్చింది. అయితే, ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) రాడార్లో మాత్రం అటువంటిదేమి రికార్డవ్వలేదని సెక్యూరిటి అధికారులు వెల్లడించారు.