UGC-NET 2020: మళ్లీ వాయిదా - ఈ నెల 24 నుంచి పరీక్షలు నిర్వహిస్తామన్న ఎన్టీఏ
దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో.. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్) అర్హత కోసం నిర్వహించే యూజీసీ నెట్ అర్హత పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. యూజీసీ నెట్-2020కి సంబంధించి మొదటి విడత పరీక్షలు ఈనెల 16 నుంచి 18 వరకు, రెండో విడుత పరీక్షలు ఈనెల 21 నుంచి 25 వరకు జరగాల్సి ఉండగా.. వాటిని వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(ఎన్టీఏ) సోమవారం కీలక ప్రకటన చేసింది.
యూజీసీ నెట్-2020 అర్హత పరీక్షలు ఈనెల 24 నుంచి నిర్వహిస్తామని ఎన్టీఏ తన ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి మే, జూన్ నెలల్లో జరగాల్సిన యూజీసీ నెట్-2020 పరీక్షలు కరోనా కారణంగా సెప్టెంబర్ కు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం అన్ లాక్ కొనసాగుతుండటం, వివిధ ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో నెట్ పరీక్షలు కూడా సాఫీగా సాగుతాయని అంతా భావించారు. కానీ ఈనెల 16 నుంచి 24 మధ్యలోనే ''ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్) పరీక్షలు ఉండటంతో తేదీలు క్లాష్ కాకూడదన్న ఉద్దేశంతోనే యూజీసీ నెట్-2020 పరీక్షలను వాయిదా వేసినట్లు ఎన్టీఏ వివరించింది.
''ఐసీఏఆర్ పరీక్షలు ఈనెల 16, 17, 22, 23 తేదీల్లో జరగనున్నాయి. కాబట్టి అనివార్యంగా, పరీక్షల తేదీలు క్లాష్ కాకూడదనే యూజీసీ నెట్-2020ను మరోసారి వాయిదా వేశాం. సెప్టెంబర్ 24 నుంచి నెట్ పరీక్షలు నిర్వహిస్తాం. ఆయా సబ్టెక్టుల వారీగా సవరించిన షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తాం. '' అని ఎన్టీఏ సీనియర్ డైరెక్టర్ సాధనా పరాశర్ మీడియాతో అన్నారు.