ఆధార్ లింక్ అయిందో లేదో మీరే చెప్పండి: టెలికాం సంస్థలకు యూఐడీఏఐ ఆదేశం
న్యూఢిల్లీ: వినియోగదారుల మొబైల్ నంబర్లకు వారి ఆధార్ అనుసంధానం అయిందో లేదో తెలుసుకునే సదుపాయం ఏర్పాటు చేయాల్సిందిగా టెలికాం సంస్థలకు యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆధారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఆదేశించింది.
మొబైల్ నంబర్లకు ఆధార్ను అనుసంధానం చేసుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 1.2 బిలియన్ల మంది యూజర్లు తమ మొబైల్ నంబర్లకు ఆధార్ను అనుసంధానం చేసుకున్నారు.
బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు ఇతరత్రా సేవలకు ఆధార్ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గతంలో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. మార్చి 31లోగా మొబైల్ వినియోగదారులు తమ నంబర్లను ఆధార్కు అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే.. కొంతమంది టెలికాం ఆపరేటర్లు, ఏజెంట్లు వినియోగదారుల ఆధార్ వివరాలను తీసుకొని వాటిని వేరే విధంగా ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిని గుర్తించిన యూఐడీఏఐ టెలికాం సంస్థలకు ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది.
కొత్తగా సిమ్ కొనుగోలు చేసే వినియోగదారుల దగ్గర్నుంచి ఇప్పటికే ఉన్న నంబర్లకు ఆధార్ను అనుసంధానం చేసుకున్న చందాదారులకు మార్చి 15లోగా ఈ సదుపాయాన్ని కల్పించాల్సిందిగా యూఐడీఏఐ సూచించింది. వినియోగదారుడు ఏ మొబైల్ నంబర్కు ఆధార్ లింక్ చేసుకున్నాడు తదితర వివరాలను తెలుసుకోగలిగేలా ఈ కొత్త సదుపాయాన్ని తీసుకురానున్నారు.
దీనిపై యూఐడీఏఐ సీఈవో అజయ్భూషణ్ పాండే మాట్లాడుతూ... 'ఈ కొత్త ఆదేశాల ప్రకారం వినియోగదారుడు ఏ మొబైల్ నంబర్కు ఆధార్ను లింక్ చేసుకున్నాడో తెలుసుకోవచ్చు. మార్చి 15లోగా అందుకు సంబంధించి కొత్త విధానాన్ని టెలికం సంస్థలు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా సూచించాం..' అని తెలిపారు.