ఆధార్ సేవా కేంద్రాలపై కేంద్రం గుడ్ న్యూస్- - దేశంలో 14 వేల సెంటర్లు తిరిగి ప్రారంభం....
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో మూతపడిన 14 వేల ఆధార్ సేవా కేంద్రాలను కేంద్రం తిరిగి ప్రారంభించింది. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో వీటిని తిరిగి తెరుస్తున్నట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-యుడాయ్ ఇవాళ ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆధార్ కేంద్రాలతో పాటు పోస్టాఫీస్ లు, బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్ సెంటర్లు తదితర చోట్ల ఈ సెంటర్లు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్లోని మాదాపూర్, విజయవాడలోని లబ్బీపేట, విశాఖపట్టణంలోని ద్వారకానగర్, వరంగల్లోని నయీంనగర్లలో ప్రస్తుతం ఆధార్ సేవా కేంద్రాలు తెరుచుకున్నట్టు ఆధార్ ప్రాధికార సంస్ధ తన ట్వీట్లో తెలిపింది.
ఆధార్కార్డులో మార్పు చేర్పులు చేసుకోవాలనుకునే వారు ఆయా చోట్ల తమ సేవలను వినియోగించుకోవచ్చని కేంద్రం పేర్కొంది. వాస్తవానికి కేంద్రం పరిధిలోని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆధార్ సేవా సెంటర్లు మాత్రమే ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. వీటితో పాటు చాలా ప్రాంతాల్లో ప్రైవేటు ఏజెంట్ల ఆధ్వర్యంలో, ఆన్ లైన్ ద్వారా కూడా ఆధార్ మార్పులు చేర్పులు చేసుకునేందుకు, కొత్తగా నమోదు చేసుకునేందుకు వీలుంది.