ట్విస్ట్: ఇంటి ఎదుట ఉజ్వల శర్మ ధర్నా, ఎన్డీ తివారీ ఓకే
లక్నో: ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ, ఉజ్వల శర్మ వ్యవహారం శుక్రవారం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఎన్డీ తివారీ కొద్ది రోజుల క్రితం... రోహిత్ శేఖర్ను తన తనయుడిగా అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే, తివారీ నివాసం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డి) భవానీ భట్ తనను, తన కుమారుడు రోహిత్ శేఖర్ను ఆ ఇంట్లోకి వెళ్లనివ్వట్లేదంటూ ఉజ్వల తివారీ ఇంటి ముందు శుక్రవారం ధర్నాకు దిగారు.
గత నెల 17న రాత్రివేళ భవానీ భట్ తనను ఆ ఇంటి నుంచి బయటకు బలవంతంగా పంపి వేశారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. రోహిత్ శేఖర్ను తివారీ తనకు పుట్టిన బిడ్డగా అంగీకరించినందున.. ఈ వయసులో ఆయనకు అండగా ఉండాలని తాము కోరుకుంటున్నామని.. కానీ, ఆయన ఆస్తి మీద ఏకఛత్రాధిపత్యం కోరుకుంటున్న కొందరు వ్యక్తులు ఆయన కుటుంబాన్ని ఆయనతో పాటు ఉండడానికి ఒప్పుకోవట్లేదని ఆరోపించారు.
తివారీని కలుసుకోవాలంటూ ఉజ్వల ధర్నా చేసిన నేపథ్యంలో హజరత్గంజ్ సర్కిల్ అధికారి దినేష్ యాదవ్ జోక్యం చేసుకుని ఆమెను తివారీ వద్దకు తీసుకెళ్లారని భవానీ భట్ తెలిపారు. ఉజ్వల తనతో కలిసి ఉండటానికి తివారీ అంగీకరించినట్లు సమాచారం.
జరిగిన పరిణామాల అనంతరం ఓఎస్డీ భవానీ భట్ తన విధులకు రాజీనామా చేశారు. తివారీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉండగా హైదరాబాద్లో ఆ తల్లీకొడుకులు ఆయనపై కుట్రపన్నారని, భవిష్యత్తులో ఆమె తన పైనా, తివారీ పైనా కుట్ర పన్నుతారని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాను ఓఎస్డీ పదవికి రాజీనామా చేస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు.