జమ్ము కశ్మీర్కు వెళ్లరాదంటూ తమ పౌరులను హెచ్చరించిన విదేశీ ప్రభుత్వాలు
జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారం రావడంతో తమ దేశ పౌరులు జమ్ముకశ్మీర్కు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశాయి జర్మనీ, ఆస్ట్రేలియా, యూకే దేశాలు. అమర్నాథ్ యాత్రకు వెళ్లిన భక్తులే లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఇతర దేశాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే అమర్నాథ్ యాత్రకు వెళ్లిన భక్తులను తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇప్పటికే అధికారులు సూచించారు.
జమ్ము కశ్మీర్లో పర్యటించాలనుకునే తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది యూకే ప్రభుత్వం. స్థానిక అధికారులు సూచనలను పాటించాలని తెలిపింది.రోజువారీ వచ్చే అప్డేట్స్ను తెలుసుకుని సురక్షితంగా తిరిగి దేశం చేరుకోవాలని యూకే ప్రభుత్వం పేర్కొంది. జమ్ము కశ్మీర్లో పరిస్థితిని న్యూఢిల్లీలోని బ్రిటీష్ హైకమిషన్ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్లో విదేశీయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని యూకే ట్రావెల్ అడ్వైజరీ పేర్కొంది. ఇదిలా ఉంటే జర్మనీ దేశం కూడా ఇలాంటి సూచనలే తమ దేశస్తులకు జారీ చేసింది. కశ్మీర్కు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లరాదని సూచించింది.
కశ్మీర్కు వెళ్లేముందు అక్కడి పరిస్థితిని ఒక్కసారి తెలుసుకోవాలని జర్మన్ దేశస్తులను కోరింది ఆ దేశ ప్రభుత్వం. ముఖ్యంగా లడఖ్ ప్రాంతంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. ఈ ప్రాంతంలో తెలియని వారితో వెళ్లడం కానీ, ఒంటరిగా ప్రయాణించడం కానీ చేయొద్దని హెచ్చరించింది. పాకిస్తాన్ సరిహద్దులకు వెళ్లడం కూడా శ్రేయస్కరం కాదని సూచించింది. ఈ రెండు దేశాలు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆస్ట్రేలియా కూడా తమ దేశస్తులను జాగ్రత్తగా ఉండాలంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే జమ్మూకశ్మీర్లో ఉన్న ఆస్ట్రేలియన్లు వెంటనే భారత సెక్యూరిటీని ఆశ్రయించాలని కోరింది.