50 దేశాలకు విస్తరించిన యూకే కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ .. ఇండియాలో కేసులు ఎన్నంటే
ఇండియాలో ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది . భారతదేశంలో ఒకపక్క కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే, మరోపక్క యూకే కరోనా కొత్త స్ట్రెయిన్ మాత్రం కలవరపెడుతుంది. యూకే కరోనా కొత్తరకం వైరస్ కేసులు ఈ రోజు కూడా ఇండియాలోమరో రెండు నమోదయ్యాయి. ఇక వీరికి సన్నిహితంగా ఉన్న వారిని సైతం క్వారంటైన్ కు పంపించారు. ఇప్పటివరకు భారత దేశంలో యూకే కరోనా కొత్తరకం కేసుల సంఖ్య 116 కి పెరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.
బ్రిటన్ లో మొదలైన కరోనా కొత్త రకం వైరస్ ఇప్పటి వరకు 50 దేశాలలో విస్తరించింది. ఇక ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది . వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో అన్ని దేశాలు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచిస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారి కరోనా మహమ్మారి కి శాశ్వతంగా చెక్ పెట్టడం కోసం ఒకపక్క ప్రయత్నం జరుగుతున్న సమయంలో మరోపక్క యూకే కరోనా కొత్త రకం వైరస్ కేసులు పెరగటం ఇబ్బంది పెడుతుంది.
మొదట విమాన సర్వీసులు నిలిపివేసిన కేంద్ర సర్కార్ తిరిగి జనవరి 8వ తేదీ నుండి విమాన సర్వీసులను పునరుద్ధరించడంతో యూకే నుండి ప్రయాణికుల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే వీరందరికీ ఎయిర్ పోర్టుల లోనే కరోనా పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్ గా తేలిన వారి రక్త నమూనాలను వైరాలజీ ల్యాబ్ లకు పంపిస్తున్నారు. ముఖ్యంగా వారి వివరాలు సేకరించటంతో పాటు వారి కుటుంబ సభ్యుల కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా చేపడుతున్నట్టు ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ . పాజిటివ్ వచ్చిన వారి జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా చేపడుతున్నామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.