15వ శతాబ్దం నాటి సీతారామ, లక్ష్మణ విగ్రహాలు తిరిగి భారత్కు: యూకే అంగీకారం
లండన్/న్యూఢిల్లీ: తమిళనాడులోని ఆలయం నుంచి అపహరణకు గురైన 15వ శతాబ్దం నాటి శ్రీ సీతారాములు, లక్ష్మణుల విగ్రహాలను లండన్ నుంచి తిరిగి తెప్పించడానికి భారత ప్రభుత్వం సిద్ధమైంది. యూకే అధికారులు ఈ విగ్రహాలను భారత్కు తిరిగి ఇచ్చేందుకు అంగీకరించారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వెల్లడించారు.
తమిళనాడులోని ఓ ఆలయం నుంచి 1978లో అపహరణకు గురైన ఈ మూడు విగ్రహాలను తిరిగి భారత్కు అప్పగించేందుకు యూకే అంగీకరించిందని, త్వరలోనే వీటిని భారత్కు తీసుకొస్తామని తెలిపారు. 15వ శతాబ్దంలో విజయనగర రాజ్యంలో నెలకొల్పబడిన ఆలయంలోనివే ఈ మూర్తులని చెప్పారు.
ఇంతకుముందు రెండు ఇలాంటి విగ్రహాలతోపాటు ఓ పిల్లర్ను యూకే అధికారులు అందించారని కేంద్రమంత్రి తెలిపారు. సీతారాములు, లక్ష్మణుల విగ్రహాలను తిరిగి మనదేశానికి అప్పగిస్తుండటం పట్ల యూకే అధికారులకు, లండన్లోని భారత హై కమిషన్కు ప్రహ్లాద్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తిరిగి ఈ మూడు మూర్తులను తమిళనాడులోని ఆలయంలో ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది.
2014 నుంచి నరేంద్ర మోడీ సర్కారు ఇలాంటి అమూల్యమైన 40 పురాతన వస్తువులను తిరిగి భారతదేశానికి తీసుకొచ్చిందని కేంద్రమంత్రి చెప్పారు. అయితే, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2013 వరకు భారత ప్రభుత్వం కేవలం 13 కళాఖండాలు, పురాతన వస్తువులను మాత్రమే తిరిగి మనదేశానికి తీసుకురాగలిగిందని అన్నారు.
రాజస్థాన్లోని ఓ ఆలయం నుంచి 20ఏళ్ల క్రితం దొంగిలించబడి, అక్రమంగా తరలించిన శివుడి(నటరాజ) విగ్రహాన్ని కూడా తిరిగి భారతదేశానికి అప్పగిస్తామని ఈ ఏడాది ఆగస్టులో యూకే ప్రకటించింది. అరుదైన రాయితీతో తయారుచేసిన ఈ విగ్రహం బరోలిలోని ఘటేశ్వర్ ఆలయం నుంచి 1998లో అపహరణకు గురైందని భారత పురావస్తు శాఖ తెలిపింది.