కాలుష్యానికి చెక్: న్యూఢిల్లీలో అల్ట్రా క్లీన్ పెట్రోల్, డీజీల్ విక్రయం
న్యూఢిల్లీ: 2018 ఏప్రిల్ 1వ తేది నుండి న్యూఢిల్లీలోని అన్ని పెట్రోల్ బంకుల్లో అల్ట్రాక్లీన్ యూరో-6 ప్రమాణాలు గల పెట్రోల్, డీజీల్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. కాలుష్యం నుండి కాపాడేందుకు ఈ పెట్రోల్, డీజీల్ను అందుబాటులోకి తీసుకురావాలని సర్కార్ తలపెట్టింది.
దేశంలో వాయి కాలుష్యం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. అయితే సాధారణ పెట్రోల్, డీజీల్ ధరలకే ఈ పెట్రోల్, డీజీల్ను విక్రయిస్తారు.
ఢిల్లీతో పాటు నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్లతో పాటు 13 పెద్ద నగరాల్లో యూరో -6 ప్రమాణాలు కలిగిన ఇంధనాన్ని వినియోగించనున్నారు. ఏప్రిల్ 2020 నాటికి దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లోనూ ఈ ఇంధనం లభించనుంది.
దేశ రాజధానిలో ప్రభుత్వ రంగంలో నడిచే అన్ని బంకుల్లోనూ రేపటి నుండి బీఎస్-6 ప్రమాణాలు కల పెట్రోల్, డీజీల్ వావానదారులకు లభ్యం కానుందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ ప్రకటించారు.
సాధారణ పెట్రోల్ కంటే అదనంగా 50 పైసలు అల్ట్రా క్లీనింగ్ పెట్రోల్కు ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి.ఢిల్లీలో ఏడాదికి సుమారు 9.6 లక్షల టన్నుల పెట్రోల్ వినియోగమౌతోంది. మరో వైపు 12.65 లక్షల టన్నుల డీజీల్ వాడకం ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి. దేశ వ్యాప్తంగా యూరో-6 ప్రమాణాలు గల వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.