సీఏఏపై జోక్యానికి సుప్రీంలో ఐరాస మానవ హక్కుల కమిషన్ పిటిషన్.. భారత్ రియాక్షన్ ఇదీ..
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై భారత సుప్రీంకోర్టులో ఇంటర్వెన్షన్ పిటిషన్ను దాఖలు చేసింది. సోమవారం సాయంత్రం జెనీవాలోని భారత శాశ్వత మిషన్కు దీనిపై సమాచారం అందించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. సీఏఏ విషయంలో ఐరాస నేరుగా జోక్యం చేసుకోవాలనుకోవడం తీవ్ర పాధాన్యతను సంతరించుకుంది.
అయితే సీఏఏ తమ దేశ అంతర్గత వ్యవహారం అని మొదటి నుంచి చెబుతూ వస్తున్న భారత్.. మరోసారి ఇదే విషయాన్ని ఐరాస మావవ హక్కుల హైకమిషనర్ కార్యాలయానికి స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ స్పష్టమైన ప్రకటన చేశారు.
భారతదేశ సార్వభౌమత్వానికి సంబంధించిన సమస్యలపై ఏ విదేశీ సంస్థకు కోర్టుకు వెళ్లే హక్కు లేదని తాము గట్టిగా నమ్ముతున్నట్టు తెలిపారు. రాజ్యాంగబద్దంగా సీఏఏ చెల్లుబాటు అవుతుందని.. రాజ్యాంగ విలువలకు అనుుణంగానే చట్టం రూపుదిద్దుకుందని చెప్పారు. దేశ విభజన విషాదం నుండి ఉత్పన్నమైన మానవ హక్కుల సమస్యలకు సంబంధించి తమ దీర్ఘకాలిక జాతీయ నిబద్దతకు సీఏఏ అద్దం పడుతుందన్నారు. 'భారతదేశం చట్టబద్దంగా పాలించబడే ప్రజాస్వామ్య దేశం. మన స్వతంత్ర న్యాయవ్యవస్థపై అందరికీ ఎంతో గౌరవం, పూర్తి నమ్మకం ఉంది. సుప్రీంకోర్టులో మన గొంతుక,చట్టబద్దమైన పాలన మరోసారి నిరూపించబడుతుందని నమ్ముతున్నాం.' అని పేర్కొన్నారు.
Recommended Video
గతేడాది డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి దేశవ్యాప్తంగా పలు నగరాల్లో దీనిపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగానూ పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సీఏఏ కారణంగా ఢిల్లీలో అల్లర్లు కూడా చోటు చేసుకున్నాయి. దాదాపు 46 మంది మృతి చెందారు. ప్రతిపక్షాలు సైతం మొదటినుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం సీఏఏ నుంచి వెనక్కి తగ్గేది లేదని పలుమార్లు స్పష్టం చేస్తూనే వచ్చింది.