కాపీ కొట్టనివ్వలేదని ప్రిన్సిపాల్కి తుపాకీ పెట్టాడు!
భోపాల్: పరీక్షలో కాపీ కొట్టనివ్వలేదనే కోపంతో ఓ విద్యార్థి ఏకంగా ప్రిన్సిపాల్ తలపై తుపాకీ గురి పెట్టాడు. ఆందోళన కలిగించే ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లో వెళితే.. స్థానిక జైన్ కళాశాల విద్యార్థి పలుమార్లు పరీక్షలో కాపీ కొడదామని యత్నించి విఫలమయ్యాడు.
పరీక్షల్లో అక్రమాలను అరికట్టడానికి కళాశాల ప్రిన్సిపాల్ కఠిన చర్యలు తీసుకోవడంతో కాపీ కొట్టడం అతని వల్ల కాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సదరు విద్యార్థి ఏకంగా ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లి ఆయన తలపై తుపాకీ పెట్టి చంపేస్తానంటూ బెదిరించాడు.
అంతటితో ఆగకుండా, గదిలోని వస్తువులు ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం విద్యార్థి పరారీలో ఉన్నాడు. చంబల్ ప్రాంతమైన భిండ్ జిల్లాలోని కళాశాలల్లో ఇటువంటి ఘటనలు తరుచూ జరుగుతుంటాయని అధికారులు చెబుతుండటం గమనార్హం. పరీక్షల సమయంలో ఉపాధ్యాయులు కూడా ఇలాంటి బెదిరింపులకు గురికావాల్సి వస్తోందని అధికారులు వాపోయారు.