ఫీజు కట్టలేక 3వ తరగతి కూతురికి విషమిచ్చింది
కోయంబత్తూర్: విద్యను 'కొని'వ్వలేక ఓ తల్లి తన కూతురుకు విషమిచ్చింది. ఆ తర్వాత ఆమె కూడా ఆ విషాన్ని తాగేసింది. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా, తల్లి ప్రాణాలతో బయటపడింది.
తమిళనాడులోని కోయంబత్తూర్లో చోటుచేసుకున్న ఈ విషాద వివరాల్లోకి వెళితే.. తిరుపూర్ జిల్లాకి చెందిన జోషిక(8) రెండో తరగతి చదివింది. ఆమె తండ్రి భూపతి మూడేళ్ల క్రితం రూ.3లక్షలు అప్పు చేసి మలేషియాలో టైలరింగ్ షాపు పెట్టుకున్నాడు.
తల్లి యమున బ్యూటీషియన్గా పనిచేస్తోంది. రోజంతా కష్టపడినా ఇంటికి సరిపోయేంత డబ్బు వచ్చేది కాదు. దీంతో భర్త సంపాదన మీదే ఆధారపడుతోంది. భూపతి పంపిన డబ్బు అప్పు తీర్చడానికే సరిపోయేది. ఇంతలో జోషికకు పాఠశాల తెరిచారు.
మూడో తరగతికి రూ. 40 వేలు ఫీజు కట్టాలని యాజమాన్యం చెప్పడంతో యమున అది కట్టలేక కూతుర్ని చదువు మాన్పించింది. కానీ, ఈ విషయంపై మానసికంగా తీవ్ర ఆవేదనకు లోనైన యమున కూతురితో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో పురుగుల మందు కలిపిన నీళ్లు కూతురు చేత బలవంతంగా తాగించి, తానూ తాగేసింది. ఇది గమనించిన స్థానికులు ఇద్దరినీ తిరుపూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జోషిక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
యమునను మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, స్పృహలోకి వచ్చాక విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.