నాలుగుతరాలు బలవన్మరణం.. ముత్తాత నుంచి ముని మనవడు వరకు... ఇదీ బర్నాలా కుటుంబం విషాదగాధ
చండీగఢ్ : భారతీయ రైతు అప్పుల్లో పుట్టి .. అప్పుల్లో పెరిగి .. అప్పుల్లోనే చనిపోతారనే కఠోర సత్యాన్ని ఓ ఆర్థిక విశ్లేషకుడు చెప్పాడు. దీనిని ఎవరూ కాదనలేని అక్షర సత్యం. దీనికి పంజాబ్లోని ఓ కుటుంబం సాక్షిభూతంగా నిలిచింది. ఆ ఫ్యామిలీలో గత నాలుగు తరాల వారసులు తీసుకున్న అప్పు కట్టలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. రైతుల అప్పు తీరుస్తామని ప్రభుత్వాలు ఇస్తున్న హామీలు ఫలించడం లేదు. దీంతో రైతుల ఆత్మహత్యలు యధేచ్చగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పంజాబ్లో 60 మంది రైతులు చనిపోయారనే అంశాన్ని సగటు పౌరుడు జీర్ణించుకోలేకపోతున్నారు.
కశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు : ట్రక్కులో ఆయుధాల తరలింపు, ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
వ్యవసాయమే కానీ ..
భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశంలో 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే రుణాల బాధతో విలవిలలాడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నాయి. అలాగే పంజాబ్లో బర్నాలా కుటుంబం కూడా రుణం తీసుకొని అప్పుల్లో చిక్కుకొంది. 40 ఏళ్ల కింద తీసుకున్న రుణం ఆ ఇంటికి ఆశనిపాతంగా మారింది. వారి రుణం ఆ ఇంటి పెద్దల ఊపిరి తీస్తోంది. నాలుగో తరం కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. తాజాగా లవ్ ప్రీత్ సింగ్ అనే నాలుగోతరం వారసుడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.
వెంటాడుతున్న రుణం ..
గత 40 ఏళ్ల క్రితం బర్నాలా కుటుంబం రుణం తీసుకుంది. వారికి ఉంది ఎకరం పొలమే.. కానీ ఆ రుణం చక్ర వడ్డీ రూపంలో పెరుగుతుంది. దీంతో తీసుకున్న అప్పు కట్టలేక లవ్ ప్రీత్ ముత్తాత జోగిందర్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిపెద్ద చనిపోవడంతో ఆ సమయంలో ఆ కుటుంబం రోదన అరణ్య రోదనగానే మిగిలింది. తర్వాత 25 ఏళ్ల క్రితం లవ్ ప్రీత్ తాతా భగవాన్ సింగ్ కూడా అప్పు కట్టలేక సూసైడ్ చేసుకున్నాడు. ఆ సమయంలో కూడా కుటుంబం రోదించింది. తమను ఆదుకోవాలని వేడుకుంది. కానీ ఫలితం లేకుండా పోయింది.
నాలుగుతరాలు ..
లవ్ప్రీత్ కుటుంబానికి తీసుకున్న అప్పు వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలో గతేడాది అతని తండ్రి కుల్వంత్ సింగ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతోపాటు అదే ఏడాది లవ్ ప్రీత్ తాత సోదరుడు కూడా చనిపోయాడు. దీంతో నలుగురు బలవన్మరణం చెందగా .. బుధవారం లవ్ ప్రీత్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. పంజాబ్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హమీనిచ్చింది. అయితే రూ.5 లక్షల వరకు మాత్రమే చేస్తామని ప్రకటించింది.
రూ.9 లక్షలు
లవ్ ప్రీత్ రుణం రూ.9 లక్షలకు చేరింది. దీంతో వారి రుణం కేవలం రూ.57 వేలు మాత్రమే మాఫీ అయ్యింది. మిగతా రూ.8.57 లక్షలు కట్టాల్సి ఉంది. ఇందులో రూ.6 లక్షలు వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్నది కాగా .. రూ.2 లక్షలు మాత్రం బ్యాంకు నుంచి తీసుకున్న మొత్తం. కానీ అప్పు పెరుగుతూ వస్తోంది. దానికి వడ్డీ కట్టకపోవడంతో పెరుగుపోతూ ఉంది. ఈ క్రమంలో తీసుకున్న అప్పు మొత్తం కట్టలేనని లవ్ ప్రీత్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 22 ఏళ్ల యువకుడు చనిపోవడం ప్రతీ ఒక్కరిని కలచివేస్తోంది. ఆ కుటుంబ రుణం మొత్తం ప్రభుత్వమే తీర్చాలే డిమాండ్ వస్తోంది.