తిండి పెట్టలేని దుస్థితిలో కసాయిగా మారిన కన్నతల్లి .. పేదరికంతో బిడ్డను కడతేర్చిన దారుణం
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఓ తల్లి బిడ్డ ఆకలి బాధ తీర్చలేక కడతేర్చింది .
ఉత్తర ప్రదేశ్లోని ఒక పేద మహిళ, తన 6 సంవత్సరాల కుమార్తె జీవితానికి పేదరికం కారణంగా స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. దీంతో ఆమె తన కుమార్తెను హతమార్చింది .పేదరికం ఒక తల్లిని కర్కశంగా మార్చింది . నవమాసాలు మోసి కన్నబిడ్డనే కాటికి పంపింది .
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉషాదేవి, రత్నేష్ తివారి దంపతులకు 6 ఏళ్ళ
ఒక కుమార్తె తో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. హండియా పోలీస్ స్టేషన్ పరిధిలోని భెస్కి గ్రామంలో జీవనం సాగించే ఈ మహిళకు భర్త ప్రమాదంలో గాయపడటంతో ఉద్యోగం కోల్పోయారు . దీంతో కుటుంబం కనీసం తినటానికి కూడా తిండి లేని ఆర్దిక కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో మహిళ తన కుమార్తె యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందింది. కనీసం తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉన్న ఉషాదేవి భవిష్యత్తులో ఆమె పెళ్లి ఎలా చెయ్యగలమని ఆలోచించింది .
దీంతో ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది . బిడ్డను కడతేర్చింది. భర్త ప్రమాదం కారణంగా కుటుంబ భారం ఉషాదేవిపై పడింది . ముగ్గురు పిల్లలకు, అనారోగ్యంతో ఉన్న భర్తకు భోజనం పెట్టటం ఉషాదేవికి కష్టంగా మారింది. దీంతో ఉషాదేవి కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిందని, కనీస అవసరాలను కూడా తీర్చలేని పరిస్థితిలో ఉందని పోలీసులు చెప్పారు. ఐదుగురు సభ్యుల కుటుంబాన్ని నడపడం ఉషాదేవికి ప్రతి రోజు నరకంగా మారిందని దీంతోపాటు మహిళ మానసిక పరిస్థితి కూడా బాగోలేదని పోలీసులు తెలిపారు.
ఆమె చేసే కష్టంతో ఉషాదేవి మొత్తం కుటుంబానికి తిండి పెట్టటం చాలా కష్టమవుతోందని పేర్కొన్నారు. అందుకే ఆమె కడుపున పుట్టిన బిడ్డనే కడతేర్చింది .