కుష్టు రోగుల దీనగాథ: వేలిముద్రలు ఎలా, ఆధార్ లేక...
హైదరాబాద్: ఆధార్ కార్డు లేకపోవడంతో తగిన సేవలు అందక బెంగళూరులోని మగది రోడడు లెప్రసీ ఆస్పత్రిలో సాజిదా బేగం అనే 65 ఏళ్ల కుష్టు రోగి చెప్పనలవి కాని చిక్కుల్లో పడింది. న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తాకథనం ప్రకారం - సాజిదా నెలసరి సంపాదన కేవలం వేయి రూపాయలే.
వారం రోజుల్లో ఆధార్తో అనుసంధానం చేయకపోతే పింఛను ఆపేస్తామని రాజాజీనగర్ డిప్యూటీ తాహిసల్దార్ కార్యాలయం నుంచి వచ్చిన లేఖ ఆమెకు పిడుగుపాటే అయింది. ఆధార్ వెరిఫికేషన్ కోసం వేలిముద్రలు, ఐరిష్ అనివార్యం. కుష్టు వ్యాధి వల్ల వేళ్లను, కంటిచూపును కోల్పోవడంతో ఆధార్కు అవసరమైన బయోమెట్రిక్స్ ఆమెకు లేకుండా పోయాయి.
మొత్తం 57 మంది కుష్టు రోగుల్లో కనీసం పది మందికి ఆధార్ కార్డులేదని వంద పడకల లెప్రసీ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ అయూబ్ అలీ జియా చెప్పారు. తమ యూనిక్ ఐడెంటిటీ నెంబర్ను కుష్టు రోగులు ఎలా నమోదు చేసుకోవాలనే విషయంపై స్పష్టత లేదు.
సాజిదా సమస్యను అర్థం చేసుకుని బయోమెట్రిక్ వెరిఫికేషన్ నుంచి ఆమెను మినహాయించాలని కోరుతూ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) అధికారులకు లేఖ రాసినట్లు జియా న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్తో చెప్పారు.
తన వద్ద ఉన్న డబ్బుతో దుస్తులు కొనుగోలు చేసుకుంటోంది, చిన్నపాటి అవసరాలు తీర్చుకుంటోందని, ఆమె రెండు కళ్లు కూడా పోయాయని, చేతివేళ్లూ కాలివేళ్లూ లేవని, ఆమె బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేస్తారనే విషయం తనకు తెలియడం లేదని, పింఛనును అపేస్తే న్యాయమవుతుందా అని జియా అంటున్నారు.
మరో వ్యక్తి భార్య కుష్టువ్యాధితో బాధపడుతోంది. కుష్టు రోగి అయిన తనకు, తన భార్యకు కార్డు తీసుకోవడానికి ఆధార్ నమోదు కేంద్రానికి చక్కర్లు కొడుతున్నాడు. నమోదు చేసుకోబోమని బెంగుళూరులోని ఓ కేంద్రం చెప్పి పంపినట్లు అతను చెబుతున్నాడు. వారి హస్తాలను చూపిస్తూ ఆ రోగి మెడికల్ సర్టిఫికెట్ తెస్తే అప్పుడు ఆలోచిస్తామని కేంద్రం అధికారులు ఎక్స్ప్రెస్తో చెప్పారు.
పూర్తిగా వికలాంగులైతే వారిని బయోమెట్రిక్ నుంచి మినహాయించే ఆలోచన చేస్తామని పేరు చెప్పడానికి ఇష్టపడని యుఐడఎఐ అధికారి ఒక్కరు ఎక్స్ప్రెస్తో చెప్పారు. ముందు వారు పేరు నమోదు చేసుకోనీయండని అన్నారు. కంటిచూపు లేకపోతే యంత్రం రీడ్ చేసే ఇతర బయోమెట్రిక్స్ ఏవైనా ఉండవచ్చునని అన్నారు.
సాజిదా ఆధార్ కష్టాల గురించి న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసిన తర్వాత ఆమెకు అక్టోబర్ నెల పింఛను వచ్చింది. ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ నెలల పింఛను రాలేదు. దేశంలోని ఇతర ప్రాంతాల రోగులు కూడా ఇటువంటి సమన్యనే ఎదుర్కుంటుండవచ్చు.
లెప్రసీ మిషన్ ట్రస్ట్ ఇండియా 2014 ఏప్రిల్ 1వ తేదీ గణాంకాల ప్రకారం - దేశంలో 86 వేల మంది కుష్టు రోగులు ఉన్నారు. అయితే, వారి కోసం యుఐడిఎఐ ఏ విదమైన మినహాయింపూ ఇవ్వలేదు.
హర్యానాలోని హర్యానాలోని ఓ గ్రామంలోని కుష్టు రోగులకు కూడా ఇటువంటి సమస్యే ఎదురైంది. ఈ సమస్య ఈ ఏడాది జులైలో వెలుగులోకి వచ్చింది. కుష్టు రోగులు గౌరవంగా జీవించడానికి వసతి కల్పించిన ఓ సంస్థకు జులైలో ప్రభుత్వ సబ్సిడీ రేషన్ రాలేదు. గ్రామంలోని రేషన్ డిపోలో ఉన్న బయోమెట్రిక్ యంత్రం వారి వేలిముద్రలను ధ్రువీకరించలేకపోవడంతో ఆ పరిస్థితి ఎదురైంది.
వేలిముద్రలను వెరిఫై చేయలేకపోవడం వల్ల వేళ్లు ఉన్నా లేకున్నా రెటీనా ప్రాతిపదిక వెరిపికేషన్ చేశారని చక్రవర్తి గ్రామ స్థానికులు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫారం ఫ్యాక్టర్ డైలీకి చెప్పారు. అయితే, రేషన్ దుకాణాలకు అందజేసిన యంత్రాల ప్రామాణీకరణ కేవలం వేలిముద్రలను మాత్రమే తీసుకునే విధంగా ఉంది. దాంతో 200 మందికి జూన్లో రేషన్ రాలేదు. వేళ్లు లేని తాము తిండి కోసం వేలిముద్రలను ఇవ్వాల్సి రావడం క్రూరమైన జోక్ అని ఓ గ్రామస్థుడు అన్నాడు.
దేశంలోని 39 శాతం రేషన్ షాపులకు బయోమెట్రిక్ యంత్రాలు అందజేసినట్లు ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ చెబుతోంది. కనురెప్పల ద్వారా జార్షండ్లోని జంషెడ్పూర్లో కుష్టు రోగులకు ఆధార్ కార్డులు వచ్చాయి. కానీ, రేషన్ దుకాణాల్లో వేలిముద్రలే ఇవ్వాల్సి రావడంతో వారికి రేషన్ అందడం లేదు.
ఆధార్తో అనుసంధానం చేయకపోవడం వల్ల జార్షండ్లోని సిందేగా జిల్లాలో అక్టోబర్లో ఓ బాలిక ఆకలిచావుకు గురైంది. కుమారి ఎనిమిది రోజులు తిండిలేకపోవడం వల్ల సెప్టెంబర్ 28వ తేదీన మరణించినట్ల స్క్రోల్ డాట్ ఇన్ రిపోర్టు చేసింది.