కేంద్రమంత్రితో ఇలానా? నమ్మలేకపోతున్నా: కర్ణాటక మంత్రిపై నిర్మల ఆగ్రహం
బెంగళూరు: భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లాలోని ప్రాంతాలను కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించారు. కేంద్రం నుంచి ఓ పరిశీలన బృందం త్వరలో ఈ ప్రాంతాలను సందర్శించి నివేదికను తయారు చేస్తుందన్నారు.
ఆ తర్వాత కేంద్రం పరిహారాన్ని ప్రకటిస్తుందన్నారు. ఎంపీ నిధుల నుంచి రూ.కోటి, కేంద్ర రక్షణ సంస్థల నుంచి రూ.7 కోట్ల తక్షణ పరిహారాన్ని మంత్రి ప్రకటించారు. ప్రత్యేక సైనిక విమానంలో కొడగు చేరుకున్న నిర్మలా సీతారామన్ రెండు చోట్ల ప్రజల సమస్యలను ఆలకించారు.
మంత్రిపై నిర్మలా సీతారామన్ అసహనం
ఈ సందర్భంగా నిర్మల కొడగు జిల్లా ఇంఛార్జ్ మంత్రి మహేశ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడగులో ఆర్మీ సహాయక చర్యలను పరిశీలించేందుకు కర్ణాటకకు చేరుకున్న నిర్మలా .. మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో బిజీ షెడ్యూల్ దృష్ట్యా సమావేశాన్ని త్వరగా ముగించాలని మహేశ్.. సీతారామన్ను కోరారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఆమె ‘నేను కేంద్ర మంత్రిని. కానీ మీ ఆదేశాలను పాటించాల్సి వస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఇదంతా నమ్మలేకపోతున్నా..
అంతేగాక, ‘ఇదంతా నమ్మలేకపోతున్నా' అని నిర్మలా సీతారామన్ ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. తాను జిల్లా అధికారులు అందించిన ప్రణాళిక మేరకే తాను నడుచుకుంటున్నానని స్పష్టం చేశారు. అనంతరం కొడగు డిప్యూటీ కమిషనర్ను శ్రీవిద్యను పిలిపించిన సీతారామన్.. షెడ్యూల్లో తలెత్తిన సమస్యను సరిచేయాలనీ, మంత్రి మరోసారి తనను ఇబ్బందిపెట్టకుండా చూడాలని ఆదేశించారు.
మైకులు ఆన్లోనే ఉన్నాయంటూ..
‘ఓ వ్యక్తి(మంత్రి మహేశ్) కారణంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న అందరినీ బాధపెట్టాలనుకోవడంలేదని కేంద్రమంత్రి నిర్మల వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఆ గదిలో మీడియా సిబ్బందితో పాటు ఆర్మీ అధికారులు ఉన్నారు. మహేశ్తో సీతారామన్ వాగ్వాదం నేపథ్యంలో గట్టిగా మాట్లాడాలని మీడియా ప్రతినిధులు కోరగా.. ‘మైకులు ఆన్లోనే ఉన్నాయి కదా. అన్నింటిని రికార్డు చేసుకోవచ్చు. మీకు నచ్చినంతసేపు రికార్డు చేసుకోండి' అని చెప్పారు.
కేంద్రమంత్రిపై కర్ణాటక మంత్రి ఇలా..
అంతకుముందు మడికేరి పునరావాస కేంద్రంలో వరద బాధితుల్ని పరామర్శించిన మంత్రి.. జిల్లాలో నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాగా, సీతారామన్ వ్యాఖ్యలపై మహేశ్ స్పందిస్తూ..‘ఆమె(నిర్మలా సీతారామన్) తమిళనాడులో పుట్టింది. ఆంధ్రుడిని పెళ్లాడి కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైంది. ఇలాంటప్పుడు ఆమె మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండాల్సింది' అని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రి వివాదం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.