అనిశ్చితిలో దేశ ఆర్థిక వ్యవస్థ... చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ షాకింగ్ కామెంట్స్..
దేశ ఆర్థిక వృద్దిరేటుపై అనిశ్చితి నెలకొందన్నారు భారత చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం. భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుందా లేదా అన్న దానిపై అది ఆధారపడి ఉందన్నారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కోలుకోవచ్చునని.. లేదంటే ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు వేచి చూడాల్సిందేనని పేర్కొన్నారు. ఈ ఏడాది వృద్ది రేటు తక్కువగా ఉంటుందని,ఉత్పత్తిలో తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్లో.. మొదటి కొన్ని వారాల లాక్ డౌన్ కాలంలో.. దేశ ఆర్థిక వృద్ది రేటు 1.5-2శాతం ఉంటుందని అంచనా వేశాం. అయితే V-shaped రికవరీతోనే ఇది సాధ్యమవుతుందన్న కండిషన్ కూడా పెట్టాం.' అని కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. అయితే రెండో త్రైమాసికంలోనూ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందా లేదా అన్న దానిపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొందన్నారు.
ఎస్&పీ గ్లోబల్ రేటింగ్ సంస్థ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ది రేటు 5శాతం తగ్గిపోతుందని అంచనా వేసింది. అయితే ఆర్థిక వ్యవస్థ తిరిగి త్వరగానే కోలుకుంటుందని.. తద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8.5%-9.5% ఆర్థిక వృద్ది రేటు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఎస్&పీ,మూడీస్ వంటి సంస్థ భారత ఆర్థిక వృద్ది రేటు తగ్గుతుందని చెప్పినా.. భారత్లో మౌలికమైన డిమాండుకు మంచి రేటింగే ఉందన్నారు.