50 ఏళ్ల లోపు ఉన్నా సరే కరోనా వ్యాక్సిన్- షరతులివే- ఏం చేయాలంటే
దేశవ్యాప్తంగా మొదటి దశలో 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ముందుగా ఎంపిక చేసిన నాలుగు కేటగిరీల్లో ఉన్న 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తారు. అయితే వీరిలో ఫ్రంట్లైన్ వారియర్లుగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది, పోలీసులతో పాటు 50 ఏళ్ల వయసు దాటిన వారిని కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. అయితే 50 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన వారికి తొలి దశలో వ్యాక్సిన్ ఇస్తారా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం మరో క్లారిటీ ఇచ్చింది.
50 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న వారు కూడా మన దేశంలో తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారు. వీటిలో గుండెజబ్బు, ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీసమస్యలు, క్సాన్సర్, షుగర్తో పాటు ఇంకా పలు వ్యాధులు ఉన్నాయి. వీరికి నిరంతరం వైద్య సహాయం అవసరం. అలాంటి వీరికి ఇప్పుడు కరోనా సోకిన నేపథ్యంలో వీరికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం కొన్ని షరతులు విధించింది. వీటిని సంతృప్తి పరిస్తే 50 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు నిపుణుల ప్యానెల్ ప్రకటించింది.
కరోనా వ్యాక్సిన్ తొలి దశలో ఇచ్చేందుకు నిపుణుల ప్యానెల్ ఓ ప్రోటోకాల్ ఏర్పాటు చేసింది. దీని ప్రకారం ఫ్రంట్లైన్ వారియర్లు కాకుండా 50 ఏళ్ల వయస్సు కలిగిన వారికి ముందుగా వ్యాక్సిన్ ఇస్తారు. అలాగే 50 ఏళ్ల లోపు వయసు ఉన్నా కూడా తీవ్ర వ్యాధులతో బాధపడుతుంటే వారు జనరల్ ఫిజీషియన్ నుంచి తమకు వ్యాక్సిన్ అవసరమనే ధృవపత్రం తెచ్చుకుంటే వారికి కూడా ఇస్తారు. అయితే కేంద్రం ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం సదరు రోగుల వైద్య చరిత్ర ఆధారంగా ఈ నిర్ణయం తీసుకునేలా పాయింట్లు కేటాయిస్తారు. ఇలా డాక్టర్లు జారీ చేసిన సర్టిఫికెట్ను కోవిన్ యాప్లో అప్లోడ్ చేయడం ద్వారా 50 ఏళ్ల లోపు వారు కూడా వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.