త్రిశంకు స్వర్గంలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు : ఇది నీట్ పుణ్యమే మరి
వైద్యో నారాయణ హరి అని నానుడి. కానీ మనదేశంలో జనాభాకు అనుగుణంగా వైద్యులు లేరు. ఇక విద్యవిద్యను బోధించే మెడికల్ కళాశాలలు కూడా తక్కువే.
హైదరాబాద్: వైద్యో నారాయణ హరి అని నానుడి. కానీ మనదేశంలో జనాభాకు అనుగుణంగా వైద్యులు లేరు. ఇక వైద్యవిద్యను బోధించే మెడికల్ కళాశాలలు కూడా తక్కువే. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను వైద్యవిద్యాభ్యాసం చేయించేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకైనా వెనుకాడటం లేదు. కానీ ఈ ఏడాది నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి 'నీట్' ఎంట్రన్స్ నిర్వహించడం, దాని ఆధారంగానే సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ జరపాలనడం వరకు బాగానే ఉన్నది.
కానీ నీట్ అడ్మిషన్ల వల్ల ప్రైవేట్, ఎయిడెడ్, డీమ్డ్ యూనివర్సిటీలు భారీ సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాయి. ఆయా కాలేజీల్లోని సీట్లన్నీ భర్తీ కావడం అనుమానమే. వైద్య విద్యకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. లక్షలు కుమ్మరించైనా వైద్యులు అనిపించుకునేందుకు విద్యార్థులు, తల్లితండ్రులు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు.
అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఏకీకృత కౌన్సెలింగ్ జరుగుతున్న క్రమంలో నూతన మార్గదర్శకాల కింద ప్రయివేట్ వైద్య కళాశాలల్లో సీట్లు భర్తీ కావడం లేదు. అడ్మిషన్లలో కొత్త నిబంధనలతో ప్రైవేట్ కళాశాలల్లో 50 శాతానికి పైగా డెంటల్ కోర్సుల్లో సుమారు 85 శాతం సీట్లు ఖాళీ అని పరిస్థితులు చెబుతున్నాయి.
న్యాయశాఖ అభిప్రాయం తెలిస్తే మిగతా సీట్ల భవితవ్యం
ఎంబీబీఎస్ ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 28 చివరి తేదీ. ఈ నెలాఖరులోగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం యూనివర్సిటీలు అనుమతి లేకుండా సొంతంగా విద్యార్థులను చేర్చుకోకూడదు. గురువారంతో మూడో విడత కౌన్సెలింగ్ కూడా పూర్తవుతుంది. సుప్రీంకోర్టు తీర్పు, ప్రభుత్వ నిబంధనల వల్ల దేశవ్యాప్తంగా అఖిల భారత కోటాలోని 15 శాతం సీట్లలో మూడో వంతు సీట్లు ఖాళీగానే ఉంటాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సీట్లను రాష్ట్రాల కోటా కిందకు మార్చేస్తే అన్నీ సీట్లు భర్తీ అవుతాయి. అయితే దీనిపై న్యాయశాఖ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వైద్య విద్యనభ్యసించాలని ఆకాంక్షిస్తున్న వారి ఆశలు నెరవేరాలంటే నూతన కౌన్సెలింగ్ విధానంలో సమస్యలు ఎదుర్కొంటున్న డీమ్డ్ యూనివర్సిటీలకు డీజీహెచ్ఎస్ క్లియరెన్స్ ఇస్తేనే సీట్లు బదిలీ చేసుకునేందుకు వీలు కలుగుతుంది.
170 ఎంబీబీఎస్ సీట్లకు సగం మాత్రమే భర్తీ ఇలా
కర్ణాటకలోని ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాల అధిపతి మాటల్లో చెప్పాలంటే ‘మాకు 200 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 30 ఎన్నారైలవి. ఈ కేటగిరిలో కేవలం ఒక్క సీటు మాత్రమే నింపాం. 170 జనరల్ సీట్లలో డీజీహెచ్ఎస్ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత 89 సీట్లు మాత్రమే పొందాం. బీడీఎస్ కోర్సులో 100 సీట్లకు కేవలం 29 మాత్రమే నింపగలిగాం' అని తెలిపారు. ఇప్పటివరకు డీమ్డ్ యూనివర్సిటీల్లో ఒక్క అడ్మిషన్ కూడా జరుగలేదు. అన్ని రకాల కౌన్సిలింగ్ శుక్రవారం పూర్తయిన తర్వాతే ఈ సీట్లు డీమ్డ్ యూనివర్సిటీకి బదిలీ అవుతాయి. ప్రతి పది ఖాళీ సీట్లకు డీజీహెచ్ఎస్ 100 అభ్యర్థుల జాబితా విడుదల చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. తాము పది శాతానికి తక్కువగా ఖాళీ సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుందని, గత ఏడాది డీమ్డ్ యూనివర్సిటీలు తమ విద్యార్తులను ఎంపిక చేసుకే ఆప్షన్ కలిగి ఉన్నాయని హైదరాబాద్ నగరంలోని ఒక డీమ్డ్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ తెలిపారు.
రాష్ట్రాల కోటాకు బదిలీ చేయాలంటే న్యాయపరమైన ఆటంకాలు
మరోవైపు ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ ఆల్ ఇండియా కోటా కింద 15 శాతం సీట్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇప్పటివరకూ ఒక్క సీటూ భర్తీ కాని డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయని చెబుతున్నారు. నీట్ నేపథ్యంలో తలెత్తిన ఈ గందరగోళానికి తెరదించేందుకు అధికారులు తలలు పట్టుకున్నారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ చేపట్టామని, భర్తీకాని సీట్ల విషయంలో ఎలాంటి మార్పులు చేసే పరిస్థితి లేదని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్కు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. దీనిపై న్యాయనిపుణులతో సంప్రదించి మరోసారి కోర్టును ఆశ్రయిస్తామని, లేనిపక్షంలో ఈ ఏడాది 12,000 వైద్య సీట్లు భర్తీ కావని చెప్పారు.