పంజాబ్ రైలు ప్రమాదం: ట్రెయిన్ వేగంపై సిద్ధూ ప్రశ్నల వర్షం, భార్యకు అండగా
అమృత్సర్: పంజాబ్లో ఇటీవల జరిగిన రైలు ప్రమాదంపై కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ విచిత్ర వాదన తెరపైకి తెచ్చారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో సిద్దూ సతీమణి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధూ స్పందించారు.
రైలు ప్రమాదం తర్వాత కనిపించని నిర్వాహకులు, సిద్ధూ రాజీనామాకు డిమాండ్
రైల్వే శాఖ డ్రైవర్కు క్లీన్ చిట్ ఎలా ఇస్తుందని, విచారణ జరపకుండా ఎలా చెబుతారని, రైలు ఎంత వేగంగా వస్తుందో తెలియాల్సి ఉందని, అక్కడి గేటు వద్ద ఉన్న వ్యక్తి డ్రైవర్కు పట్టాలపై వందలాది మంది ఉన్నారనే సమాచారం ఎందుకు ఇవ్వలేదని, రైలు వేగం తగ్గించాలని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
అయితే రైల్వే ట్రాక్ సమీపంలో రావణ దహన కార్యక్రమం చేపట్టడం, ట్రాక్ పైకి పెద్ద ఎత్తున జనాలు రావడం, ట్రాక్ పైకి వెళ్లవద్దని ఈ కార్యక్రమ నిర్వాహకులు చెప్పలేదని ఆరోపణలు రావడం, ఆ సమయంలో సిద్ధూ సతీమణి అక్కడి నుంచి వెళ్లిపోవడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను దత్తత తీసుకుంటామని సిద్ధూ చెప్పారు. వారికి ఉన్నత విద్యా సంస్థల్లో చదువు చెప్పిస్తామన్నారు. అలాగే ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన మహిళలకు ఆర్థిక సాయం చేస్తామన్నారు.