దేశం ముందు రెండు యుద్ధాలు..కుప్పలా 350 మృతదేహాలు: ఓపిక నశించడం వల్లే..బాధాకరం: అమిత్ షా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పరిస్థితిని సమర్థవంతగా ఎదుర్కొంటున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలను తీసుకోవాల్సి ఉందో.. వాటన్నింటినీ తీసుకుంటున్నామని అన్నారు. అనేక అభివృద్ది చెందిన దేశాలతో పోల్చుకుంటే.. మనదేశంలో కరోనా వైరస్ నియంత్రణ బాగుందని ఆయన చెప్పారు. మున్ముందు కరోనాను కట్టడి చేయడానికి మరిన్ని కఠిన చర్యలను తీసుకుంటామని అన్నారు.
Recommended Video
అనేక విషయాలపై..
ఆదివారం ఆయన ఓ జాతీయ స్థాయి న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యలో మాట్లాడారు. అనేక విషయాలను ప్రస్తావించారు. కరోనా వైరస్, చైనాతో తలెత్తిన యుద్ధ వాతావరణం, రాజకీయ ప్రత్యర్థులు సంధిస్తోన్న ప్రశ్నలు, వారి నుంచి ఎదురవుతోన్న సవాళ్లకు సమాధానాలను ఇచ్చారు అమిత్ షా. రాజకీయ ప్రత్యర్థులు సానుకూల దృష్టిని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని హితబోధ చేశారు. ప్రతి అంశాన్నీ వారు వక్రదృష్టితో చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
రెండు యుద్ధాలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని భారత్ ప్రస్తుతం ఏకకాలంలో రెండు యుద్ధాలను ఎదుర్కొంటోందని అమిత్ షా అన్నారు. ఇందులో ఒకటి కరోనా..మరొకటి చైనా.. ఈ రెండిట్లోనూ తమ ప్రభుత్వం ఘన విజయాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఈ రెండు యుద్ధాలు విభిన్నమైనవని, ఒకటి దేశ అంతర్గతంగా.. మరొకటి దేశ సరిహద్దులకు అవతల నెలకొని ఉన్నాయని అమిత్ షా వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో దారుణ పరిస్థితులు..
కరోనా వైరస్ వల్ల దేశ రాజధానిలో దారుణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని అమిత్ షా అన్నారు. అయినప్పటికీ.. పరిస్థితులను అదుపులోకి తీసుకుని రావడానికి అన్ని చర్యలను చేపట్టామని, దీనికోసం ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. వచ్చేనెల 31వ తేదీ నాటికి ఢిల్లీలో అయిదున్నర లక్షల మంది కరోనా వైరస్ బారిన పడతారంటూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చేసిన వ్యాఖ్యలను తాను ఏకీభవించట్లేదని అమిత్ షా చెప్పారు. అలాంటి దారుణ స్థితి రాదనే అనుకుంటున్నానని అన్నారు.
350 మంది మృతదేహాలకు
ఢిల్లీలో కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, ఈ విషయం అటు కేంద్రం ఇటు ఢిల్లీ ప్రభుత్వాలను ఆందోళనకు గురి చేస్తోందని అమిత్ షా అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకోకుండా 350 మృతదేహాలు పేరుకునిపోయాయని చెప్పారు. వాటికి అంత్యక్రియలను నిర్వహించడానికి రెండురోజుల సమయం పడుతుందని అన్నారు. ఆ 350 కాకుండా.. కొత్త మృతదేహాలేవీ ప్రస్తుతం పెండింగ్లో లేవని, వాటికి ఎప్పటికప్పుడు అంత్యక్రియలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఓపిక నశించడం వల్లే..
కరోనా వైరస్ను వ్యాప్తి చెందకుండా నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన అనంతరం కొన్ని బాధాకర సంఘటనలు చోటు చేసుకున్నాయని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఓపిక నశించిన కొంతమంది కాలి నడకన ప్రయాణం సాగించారని, అవి తమను బాధకు గురి చేశాయని అన్నారు. ఆ వెంటనే ప్రధానమంత్రి వారికోసం ప్రత్యేక రైళ్లను నడిపించారని చెప్పారు. ఇప్పటిదాకా కోటి 20 లక్షల మందిని వారి స్వస్థలాలకు చేర్చామని చెప్పారు. 63 లక్షల మంది వలస కార్మికులు 4594 రైలు సర్వీసులను వినియోగించుకున్నారని అన్నారు.
ఇందిరాగాంధీ తరువాత
ఇందిరాగాంధీ తరువాత గాంధీయేతర కుటుంబానికి చెందిన వారెవరైనా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులు అయ్యారా? అని అమిత్ షా ప్రశ్నించారు. పార్టీని సొంత కుటుంబంలా నడిపారని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చగా మారిన ఎమర్జెన్సీ పరిస్థితులను ప్రతి పౌరుడూ తమ జీవితాంతం గుర్తుంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు కరోనా పరిస్థితులను రాజకీయంగా మార్చుకోవడానికి అలవాటు పడ్డారని ధ్వజమెత్తారు.