మోడీ గిఫ్ట్ : గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద వలస కూలీలు రోజుకు ఎంత సంపాదిస్తారో తెలుసా?
కరోనా వైరస్ విజృంభించడంతో దేశంలో సంక్షోభం నెలకొంది. ఇక కరోనా వైరస్తో దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోవడంతో ఎక్కువగా ఇబ్బందులు పడింది మాత్రం వలస కూలీలు. ఇక వలస కూలీల ఇబ్బందులను అర్థం చేసుకున్న ప్రభుత్వం వారికోసం ప్రత్యేక రైళ్లు ప్రారంభించి వారిని తమ సొంత రాష్ట్రాలకు పంపే ఏర్పాటు చేసింది. అయితే పొట్ట చేత పట్టుకుని పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కార్మికులు తిరిగి తమ సొంతూళ్లకు చేరుకోవడంతో వారికి ఆ ఊరిలోనే పనులు కలిగేలా కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకాన్ని శనివారం రోజున ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ పథకం 125 రోజుల పాటు ఉంటుంది.
Recommended Video
బీహార్ ఉత్తర్ ప్రదేవ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లో ముందుగా ఈ పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. ఈ పథకం కిందకు మొత్తం 116 జిల్లాలకు చెందిన 25వేల మంది వలస కూలీలకు పనికల్పించనుంది. వీటిలో 27 జిల్లాలకు చెందిన వలసకార్మికులకు పని కల్పించాలని ఆయా జిల్లా పాలనా యంత్రాంగం కోరడం విశేషం. ఈ పథకం ద్వారా మూడింట రెండోవంతు వలస కూలీలకు లబ్ధి చేకూరనుంది.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకం ద్వారా బీహార్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, మరియు ఒడిషా రాష్ట్రాలకు లబ్ధి చేకూరనుంది. ఈ క్యాంపెయిన్ ద్వారా 25 రకాల ఉపాధి కల్పించే పనులు లభించనున్నాయి. ఇందుకోసం కేంద్రం రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ పథకం కింద మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద వర్తించే రోజువారీ కూలీ వర్తిస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి వలస కూలీకి రోజుకు రూ.202 ప్రభుత్వం ఇవ్వనుంది. అయితే వలస కూలీలను ఎలా గుర్తించడం జరుగుతుంది..?
ఇక లాక్డౌన్ నేపథ్యంలో తమ సొంత గ్రామాలకు వెళ్లిన వలస కూలీల జాబితా ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉంది. ఆ జాబితా ఆధారంగా వలసకూలీలకు పనులు కల్పించడం జరుగుతుంది. అంతేకాదు నగరాల నుంచి గ్రామాలకు కాలినడకన లేదా ఇతర రవాణా సౌకర్యం వినియోగించి వెళ్లిన వలస కూలీల వివరాలు ఆయా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఉన్నాయి. ఇక పనులు కల్పించడం నుంచి వారికి డబ్బులు అందజేసే వరకు అంతా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చూసుకుంటారు. ఈ కార్యక్రమం కింద వలస కూలీలకు తమకు వచ్చిన పని ఆధారంగా లేదా వారికి ఏ రంగంలో నైపుణ్యత ఉందో అందులో ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఈ క్యాంపెయిన్లో రోడ్లు, గ్రామీణ గృహనిర్మాణం, హార్టికల్చర్, మొక్కలు పెంచడం, నీటి సంరక్షణ, వ్యవసాయం, అంగన్వాడీ, పంచాయతీ భవనాలు, జల్ జీవన్ మిషన్లు ఉన్నాయి.
ఇక వలసకూలీలకు అందుబాటులో ఉన్న పనులు ఇవే.
* కమ్యూనిటీ శానిటేషన్ కాంప్లెక్స్
* గ్రామ్ పంచాయత్ భవన్
* ఫైనాన్స్ కమిషన్ ఫండ్ కింద పనులు
* నేషనల్ హైవేస్ వర్క్స్
* వాటర్ కన్జర్వేషన్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ వర్క్స్
*బావుల నిర్మాణం
* మొక్కల పెంపకం
* తోట పనులు
* అంగన్వాడీ కేంద్రాలు
* ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన
* గ్రామీణ రహదారులు సరిహద్దుల్లో రహదారుల పనులు
* భారతీయ రైల్వే కింద పనులు
* శ్యామ ప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్
* భారత్ నెట్ కింద ఫైబర్ ఆప్టికల్ కేబుల్ వర్క్ పనులు
* పీఎం కుసుమ్ యోజన పనులు
* జల్ జీవన్ మిషన్ కింద పనులు
* ప్రధానమంత్రి ఊర్జ గంగా ప్రాజెక్టు
* కృషి విజ్ఞాన్ కేంద్ర కింద జీవనోపాధి శిక్షన
* జిల్లా మినరల్ ఫండ్ పనులు
* వృథాగా ఉన్న ఘన మరియు ద్రవ పదార్థ నిర్వహణ పనులు
* ఫార్మ్ పాండ్ స్కీమ్ పనులు
* జంతువులకు షెడ్ల నిర్మాణం
* మేకలకు / గొర్రెలకు షెడ్ల నిర్మాణం
* పౌల్ట్రీ షెడ్ నిర్మాణం
* వానపాముల సంరక్షణ యూనిట్లు.