దావూద్ షష్టీ పూర్తి: డీ కంపెనీకి కొత్త బాస్ !
ముంబై/ఇస్లామాబాద్: దాయాది శత్రుదేశం పాకిస్థాన్ లో తలదాచుకుని ముంబై నేర సామ్రాజ్యాన్ని శాసిస్తున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇదే నెలలో షష్టిపూర్తి చేసుకుంటున్నాడు. అదే రోజు తన నేర సామ్రాజ్యానికి వారసుడిని ప్రకటించనున్నాడని తెలిసింది.
షష్టిపూర్తి వేడుకల్లో డీ కంపెనీ వారసుడి పేరును దావూద్ ప్రకటించే అవకాశం ఉందని నిఘా వర్గాలు పసిగట్టాయి. ఇదే విషయం వారు వెల్లడించారు. దావూద్ సోదరులలో ఎవరో ఒకరిని తన వారుసుడిగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.
దావూద్ సోదరుడు అనీస్ అహమ్మద్ డీ కంపెనీ వారసుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. అయితే డీ కంపెనీలో కీలమైన వ్యక్తి, దావూద్ ఇబ్రహీంకు రైట్ హ్యాండ్, డీ గ్యాంగ్ సీఈవో గా చెప్పుకునే చోటా షకీల్ స్థానం యథాతధంగా ఉంచుతారని నిఘా వర్గాలు అంటున్నాయి.
ముంబై లీడర్లకు నో న్యూస్
దావూద్ ఇబ్రహీం ఏమి చేసినా ముంబైలోని బిగ్ షాట్ లకు తెలిసిపోతుంది. అయితే వాళ్లు కూడా భాయ్ దిగిపోతున్నాడని తమకు తెలియదని చెబుతున్నారని నిఘా వర్గాలు అంటున్నాయి.
పార్టీలోనే పూర్తి వివరాలు
శనివారం దావూద్ ఇబ్రహీం షష్టిపూర్తి (60వ పుట్టిన రోజు) చేసుకోనున్నాడు. ఆ రోజు జరిగే పార్టీలో డీ గ్యాంగ్ వారసుడిని ప్రకటించే అవకాశం ఉంది.
పార్టీ ఎక్కడ అనేది టాప్ సీక్రెట్
పార్టీ ఎక్కడ జరుగుతుంది అనేది టాప్ సీక్రెట్ గా ఉంచారు. ఆహ్వానం ఉన్నవారికి సైతం చివరి నిమిషయం వరకూ చెప్పరాదని డీ కంపెనీ నిర్ణయించింది.
రూ. 66 వేల కోట్ల డీ కంపెనీ
డ్రగ్స్, బెట్టింగ్, హవాల, ఆయుధాల స్మగ్లింగ్ తదితర వ్యవహారాల ద్వారా రూ. 66 వేల కోట్ల రూపాయల డీ కంపెనీ సామ్రాజ్యాన్ని కాపాడాలని దావూద్ ఇబ్రహీం భావిస్తున్నాడు.
అనారోగ్యం కారణంగా
తన అనారోగ్యం కారణంగా డీ కంపెనీ సామ్రాజ్యం దెబ్బతినరాదని దావూద్ ఇబ్రహీం నిర్ణయించాడు.
మార్గ దర్శకాలు ఇచ్చేది దావూద్
రెండు మూడేళ్లలో డీ కంపెనీ కొత్త బాస్ కు మార్గదర్శకాలు ఇచ్చి తరువాత పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని దావూద్ ఇబ్రహీం నిర్ణయించాడని సమాచారం.
ముగ్గురు సోదరులలో అనీస్ కు చాన్స్
దావూద్ సోదరుడు నూరుల్ హక్ చనిపోయాడు. ఇక్బాల్ అస్కర్ ను దుబాయ్ నుంచి వెనక్కి పంపించారు. ముస్తఖీమ్ ప్రాణాంతక వ్యాదితో బాధపడుతున్నాడు. అనీస్ ఒక్కడే డీ కంపెనీలో చురుకుగా పాల్గోంటున్నాడు.
చోటా షకీల్ సహాయంతోనే
అనీస్ తన అన్న దావూద్ ఇబ్రహీం ప్రాణా స్నేహితుడు చోటా షకీల్ సహాయంతోనే డీ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తాడని తెలిసింది.
కుమార్తెలు, భార్య ఒత్తిడి
దావూద్ ఇబ్రహీం కుమార్తెలు మహరూఖ్, మోయిన్, దావూద్ భార్య మెహజబీన్ డీ కంపెనీ బాధ్యతలు ఎవరికో ఒకరికి అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని దావూద్ ఇబ్రహీం మీద ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం.