దావూద్ ఇబ్రహీంకు సినిమా చూపించిన సీబీఐ, దుబాయ్ లో టక్లా అరెస్టు, ఇక మాఫియా డాన్!
న్యూఢిల్లీ: భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. తాను లొంగిపోతానని, అయితే కొన్ని షరతులు ఉన్నాయని భారత ప్రభుత్వానికి మొరపెట్టుకున్న దావూద్ ఇబ్రహీంకు భారత్ కోలుకోలేని దెబ్బ కొట్టంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు 1993 మార్చి 12వ తేదీ ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నిందితుడు ఫరూఖ్ టక్లాను సీబీఐ అధికారులు దుబాయ్ లో అరెస్టు చేసి మాఫియా డాన్ కు సినిమా చూపించారు.
1993 బాంబు పేలుళ్లు
1993 మార్చి 12వ తేదీన ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 257 మంది అమాయకులు బలి అయ్యారు. ముంబై బాంబు పేలుళ్ల అనంతరం దావూద్ ఇబ్రహీంతో పాటు అతని ప్రధాన అనుచరుడు ఫరూఖ్ టక్లా భారతదేశం వదిలి దుబాయ్ కి పరారైనారు.
రెడ్ కార్నర్ నోటీసు
1995లో సీబీఐ అధికారులు ఫరూఖ్ టక్లా కోసం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. అప్పటి నుంచి ఫరూక్ టక్లా కోసం సీబీఐ అధికారులు గాలిస్తున్నారు. అయితే ఫరూఖ్ టక్లా మాత్రం సీబీఐ అధికారుల కంటికి కనపడకుండా తలదాచుకున్నాడు.
అమెరికా ఎంట్రీ
1993లో ముంబై వరుస బాంబు పేలుళ్లలో 257 మంది దుర్మరణం చెంది 720 మందికి పైగా తీవ్రగాయాలు కావడానికి కారణం అయిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుడు ఫరూఖ్ టక్లాను అమెరికా ఇంటర్ పోల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది.
పక్కా సమాచారం
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఫరూఖ్ టక్లా దుబాయ్ లోని ఓ రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడని పక్కా సమాచారం అందడంతో సీబీఐ అధికారులు నిఘా వేశారు. దుబాయ్ చేరుకున్న సీబీఐ అధికారులు బుధవారం రాత్రి ఫరూఖ్ టక్లాను అరెస్టు చేశారు.
ముంబై టాడా కోర్టు
సీబీఐ అధికారులు దుబాయ్ లో అరెస్టు చేసిన ఫరూఖ్ టక్లాను గురువారం (మార్చి 8వ తేదీ) భారత్ తీసుకు వస్తున్నారు. దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఫరూఖ్ టక్లాను ముంబైలోని టాడా కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి అనుమతితో అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు.