ఒకే ఫ్యామిలీలో ఐదు మంది ఆత్మహత్య, గనుల మాఫియా వార్నింగ్ ?, గాలి కేసు తరువాతే !
బెంగళూరు: వ్యాపార సమస్యలతో విసిగిపోయిన వ్యాపారవేత్త కుటుంబ సభ్యులతో కలిసి సామూహిక ఆత్మహత్య చేసుకున్న సంచలన సంఘటన కర్ణాటకలోని మైసూరు సమీపంలోని చామరాజనగర జిల్లా, గుండ్లుపేట తాలుకాలో జరిగింది. ఒకే కుటుంబంలో ఐదు మంది తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడంతో వారి బంధువులు ఆర్తనాదాలు చేస్తున్నారు. బళ్లారి గనుల మాఫియా బెదిరింపులు, ఐటీ శాఖ వేధింపు కారణంగా ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు.
బళ్లారిలో గనులు, దుబాయ్ లో వ్యాపారం
మైసూరు నగరానికి చెందిన ఓం ప్రకాష్ భట్టాచార్య అనే ఆయన నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓం ప్రకాష్ బళ్లారిలో గనుల (మైనింగ్) వ్యాపారం చేశారని ఆయన స్నేహితులు, బంధువులు అన్నారు. బళ్లారిలో గనుల వ్యాపారం చేసే సమయంలో ఐటీ శాఖ అధికారులు తనను వేధింపులకు గురి చేశారని ఓం ప్రకాష్ ఆవేదన చెందేవాడని ఆయన స్నేహితులు అంటున్నారు. బళ్లారిలో గనుల వ్యాపారంతో పాటు దుబాయ్ లో ఓం ప్రకాష్ కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, భద్రత కోసం గన్ మ్యాన్ ను పెట్టుకున్నారని ఆయన స్నేహితులు అంటున్నారు.
జ్యోతిష్యుడి ఫ్యామిలి
ఓం ప్రకాష్ తండ్రి జ్యోతిష్యుడు. ఓం ప్రకాష్ కుటుంబ సభ్యులు హిందూ సాంప్రధాయాలను తప్పకుండా పాటించి ప్రత్యేక పూజలు చేసేవారని ఆయన స్నేహితులు అంటున్నారు. ఆగస్టు 15వ తేదీ పున్నమి రోజు ఓం ప్రకాష్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మైసూరులోని ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తరువాత ఓం ప్రకాష్, ఆయన కుటుంబ సభ్యులు గుండ్లుపేట తాలుకాలోని దెట్టగెళ్ళిలోని ఫాం హౌస్ చేరుకున్నారు. దెట్టగెళ్ళిలోని ఇంటిలోనే ఓం ప్రకాష్, ఆయన కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఎందుకు అంత పట్టు ?
రెండు సంవత్సరాల క్రితం ఓం ప్రకాష్ గుండ్లుపేట తాలుకాలోని దెట్టగెళ్ళిలోని ఇంటిని కొనుగోలు చేశారు. వేరే వ్యక్తి ఇదే ఇంటిని రూ. 1 కోటికి కొనుగోలు చెయ్యడానికి సిద్దం అయ్యారు. అయితే ఓం ప్రకాష్ పట్టుబట్టి పోటీ పడి అదే ఇంటిని రూ. 1. 5 కోట్లకు కొనుగోలు చేశారని ఆయన బంధువులు అంటున్నారు. చేతబడి చేయడం వలనే పున్నమి రోజు ఓం ప్రకాష్, ఆయన కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుని ఉంటారని వారి బంధువులు ఆరోపిస్తున్నారని దర్యాప్తు చేస్తున్న ఓ పోలీసు అధికారి తెలిపారు.
గాలి జనార్దన్ రెడ్డి కేసు తరువాతే !
ఓం ప్రకాష్ బళ్లారిలో గనుల వ్యాపారం చేసేవారు. గాలి జనార్దన్ రెడ్డి మీద ఐటీ అధికారులు దాడులు చేసిన తరువాత ఓం ప్రకాష్ గనుల వ్యాపారం దెబ్బ తినిందని సమాచారం. తరువాత అధికారులు ఓం ప్రకాష్ కు చెందిన రూ. వందల కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేశారని తెలిసింది. ఆర్థిక సమస్యలతో సతమతం అయిన ఓం ప్రకాష్ స్నేహితుల దగ్గర అప్పులు చేశారని వెలుగు చూసింది. 15 రోజులకు లేదా నెలకు ఒక సారి సుప్రీం కోర్టులో కేసు విచారణ ఉందని ఓం ప్రకాష్ ఢిల్లీ వెళ్లి వచ్చేవారని ఆయన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మాఫియా వార్నింగ్ ?
గనుల వ్యాపారంలో దెబ్బ తిన్న తరువాత ఓం ప్రకాష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అదే విధంగా మైసూరులోని కువెంపునగర్ లో డాటా బేస్ కంపెనీ ప్రారంభించారు. అన్ని వ్యాపారాల్లో నష్టం రావడంతో ఓం ప్రకాష్ విసిగిపోయారని తెలిసింది. అదే సమయంలో గనుల మాఫియా నుంచి బెదిరింపులు ఎక్కువ అయ్యాయని, ఐటీ వేధింపులు ఎక్కువ అయ్యాయని, అందుకే ఓం ప్రకాష్ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారని ఆయన మామ శాంతారామ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చామరాజనగర్ జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాకు చెప్పారు.